బీజేపీ ముందే లీక్ చేసింది: పన్నీర్ స్కెచ్, దినకరన్ ఔట్, ఆ ఢిల్లీ నేత ఎవరు!
న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటూ నానా హంగామా చేసిన టీటీవీ దినకరన్ అరెస్టు అవుతాడని ముందుగానే ఢిల్లీ నుంచి పన్నీర్ సెల్వం వర్గానికి సమాచారం వచ్చిందని తెలిసింది. దినకరన్ అరెస్టు గ్యారెంటీ అంటూ ఢిల్లీలోని కొందరు పెద్దలు సమాచారం ఇచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం ఢిల్లీలో పావులుకదిపారని తెలిసింది.
గత నాలుగు రోజుల నుంచి టీటీవీ దినకరన్ ను విచారించిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు అతను నేరం చేశాడని గర్తించారు. అయితే పైకి మాత్రం సరైన సాక్షాలు చిక్కలేదని మంగళవారం సాయంత్రం వరకు చెప్పిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదే రోజు అర్దరాత్రి ఆయన్ను అరెస్టు చేశారు.
బ్రోకర్ న్యాయవాదుల దెబ్బ
ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన మీడియేటర్ సుఖేష్ చంద్రశేఖర్ న్యాయవాదుల అత్యుత్సహం వలనే టీటీవీ దినకరన్ అర్దరాత్రి అరెస్టు అయ్యాడని సమాచారం. చంద్రశేఖర్ కు బెయిల్ ఇప్పించాలని ప్రయత్నించిన మీడియేటర్ న్యాయవాదులే దినకరన్ ను ఇరికించేశారు.
దినకరన్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు
చంద్రశేఖర్ ను అరెస్టు చేసి తొమ్మిది రోజులు అయినా దినకరన్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని మంగళవారం ప్రత్యేక కోర్టు ముందు మీడియేటర్ చంద్రశేఖర్ తరపు న్యాయవాదులు అశ్విన్ కుమార్, మహేష్ ప్రధాన్ వాదించారు.
క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దినకరన్ మీద ఏం చర్యలు తీసుకున్నారు ? ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు అన్నీ దినకరన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని, అయినా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? అంటూ క్రైం బ్రాంచ్ పోలీసులను కోర్టు ప్రశ్నించింది.
ఇద్దరి కాల్ డేటా తీసుకురండి
సుఖేష్ చంద్రశేఖర్, దినకరన్ సంప్రదింపులు జరిపారని తెలిపే కాల్ డేటాను కోర్టులో సమర్పించండి అంటూ ప్రత్యేక న్యాయమూర్తి పూనమ్ చౌధరి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ వేగవంతం చేసి అర్దరాత్రి దినకరన్ అరెస్టు చేసి టీటీవీ వర్గీయులకు సినిమా చూపించారు.
ఎన్నికల కమిషన్ దగ్గరకు
అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మీకే ఎందుకు ఇవ్వాలి అనే సరైన పత్రాలు, అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ జూన్ 16వ తేదీ వరకు రెండు వర్గాలకు గడుపు ఇచ్చింది. అయితే పన్నీర్ సెల్వం ఎడప్పాడి పళనిసామి వర్గానికి సినిమా చూపించారు.
కేంద్రం చెప్పింది, ఊహించని షాక్ !
టీటీవీ దినకరన్ ను అరెస్టు చేస్తున్నారని కేంద్రంలోని ఓ కీలక నేత పన్నీర్ సెల్వంకు సమాచారం ఇచ్చారని, వెంటనే ఆయన ముందుగా సిద్దం చేసుకున్న 6,500 పేజీల అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టి ఎడప్పాడి పళనిసామి వర్గానికి ఊహించని షాక్ ఇచ్చారని సమాచారం.
పన్నీర్ వెనుక బీజేపీ ?
నాలుగు రోజుల నుంచి దినకరన్ విషయంలో ఎప్పటికప్పుడు కేంద్రంలోని పెద్దలు పన్నీర్ సెల్వంకు సమాచారం ఇస్తున్నారని తెలిసింది. అందువలనే ఎన్నికల కమిషన్ ముందు తన వాదన ముందుగానే వినిపించామని, పళనిసామి వర్గాన్ని చిక్కుల్లో పెట్టాలని పన్నీర్ సెల్వం పక్కాస్కెచ్ వేశారని ఆయన వర్గంలోని ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.