సీఎం సీటు కోసం కాంగ్రెస్ వార్: కామేడీ చూస్తున్న బీజేపీ, మాజీ సీఎం మాటలకు అర్థాలు వేరులే !
బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే ఎప్పుడో ముఖ్యమంత్రి కావలసి ఉండేదని సీఎం కుమారస్వామి అన్నారు. ఆయన తరువాత సిద్దరామయ్య ట్వీట్ ద్వారా సొంత పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చారు. ఈ కాంగ్రెస్ నాయకుల సీఎం సీటు వార్ మీద బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావలి కాంగ్రెస్ నేతల మీద జాలి చూపించారు. సీఎం, మాజీ సీఎంల మాటలకు అర్థాలు వేరులే అంటున్నారు అరవింద్ లింబావలి.
సీఎం కుమారస్వామి మల్లికార్జున్ ఖార్గే మీద ప్రేమతో అన్నారో, వ్యంగంగా అన్నారో ఆయనకే తెలియాలని అరవింద్ లింబావలి అన్నారు. కలబురిగి జిల్లా చించోళి శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవింద్ లింబావలి స్థానిక వడ్డెర కులస్తులతో మాట్లాడారు.
వడ్డెరలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ లింబావలి కాంగ్రెస్ నాయకుల ట్వీట్ లు చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచారమో, లేక వారు యుద్దాలు చేసుకుంటున్నారో ప్రజతకు అర్థం కావడం లేదని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అన్నారు.
మీ మాటల యుద్దాలతో ప్రజలు మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారా అని కాంగ్రెస్ నేతలను అరవింద్ లింబావలి ప్రశ్నించారు. కనీసం కాంగ్రెస్ నాయకులు ఈ ఉప ఎన్నికల్లో ఒక్కటి అవుతారని కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్నారని, అది ఎన్నటికీ జరగదని వీళ్లు నిరూపించారని అరవింద్ లింబావలి వ్యంగంగా అన్నారు.
కాంగ్రెస్ నాయకులు పరస్పర గొడవలతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అరవింద్ లింబావలి జోస్యం చెప్పారు. మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు సంకీర్ణ ప్రభుత్వం తీరుపై అసహనంతో ఉన్నారని, వారందరూ రాజీనామా చేస్తే మరన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అరవింద్ లింబావలి అభిప్రాయం వ్యక్తం చేశారు.