బీజేపీ ఎమ్మెల్యే మృతి, ఉరేసుకొన్న దేవేంద్రనాథ్ రాయ్.. రాజకీయ హత్యేనని అంటోన్న ఫ్యామిలీ..?
పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రాయ్ చనిపోయారు. తన ఇంటికి సమీపంలో గల బిందాల్లో ఉరేసుకొని కనిపించారు. కానీ అతని కుటుంబసభ్యులు మాత్రం ఇదీ ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆరోపిస్తున్నారు. దేవేంద్రనాథ్ హెమ్తాబాద్ నియోజకవర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీపీఎం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది మే నెలలో బీజేపీలో ముకుల్ రాయ్ సమక్షంలో 50 మంది కౌన్సిలర్లతో కలిసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఇంతలోనే ఉరేసుకొని కనిపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
బీజేపీ ఎంపీ అరవింద్ కారుపై టీఆర్ఎస్ నేతల దాడి, ఘర్షణ: తీవ్ర విమర్శలు, టీఆర్ఎస్ కౌంటర్
రాయ్ కుటుంబసభ్యులు మాత్రం హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మర్డర్ చేసి.. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఉరేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి కొందరు వచ్చి బైక్పై ఎక్కించుకొని వెళ్లిపోయారని.. తెల్లారేసరికి విగతజీవిగా కనిపించాడని చెబుతున్నారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
దేవేంద్ర మృతి చెందారని బీజేపీ ధృవీకరించింది. హెమ్తాబాద్ ఎస్సీ రిజర్వ్ నుంచి పోటీ చేసి గెలిచారని ట్వీట్ చేసింది. ఇంతలోనే చనిపోవడం బాధాకరమని తెలిపింది. సీపీఎం నుంచి పోటీ చేసి బీజేపీలో చేరడంతో.. అతన్ని ఏ పార్టీకి చెందినవారు పగ తీర్చుకుంటారనే ప్రశ్న వస్తుంది. దీనికితోడు బెంగాల్లో అధికార టీఎంసీ-బీజేపీ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేవేంద్రనాథ్ది హత్య అయితే ఎవరు చేశారనే అంశం పోలీసుల దర్యాప్తులో తేలనుంది.