బీజేపీలో విషాదం: ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేల మృతి
Recommended Video
జైపూర్/లక్నో: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ శాఖల్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మరణించగా, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రాజస్థాన్ ఎమ్మెల్యే కన్నుమూశారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్, రాజస్థాన్లో కళ్యాణ్ సింగ్ అనే మరో బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం మృతి చెందారు. వీరి మృతి పట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సీతాపూర్లో ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్ను ఢీకొనడంతో ఎమ్మల్యేతో పాటు ఆయన సెక్యూరిటీ గార్డులు ఇద్దరు మరణించారు.
#SpotVisuals Lokendra Singh, BJP MLA from Bijnor's Noorpur, died in a collision between his vehicle & a truck in Sitapur; two of his gunners & driver of the truck also died in the accident pic.twitter.com/OdGXJu1FSJ
— ANI UP (@ANINewsUP) February 21, 2018
ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా మరణించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే, గన్మెన్ల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బిజ్నూర్ జిల్లా నూర్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన యూపీ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2012లో నూర్పూర్ నుంచి గెలుపొందిన సింగ్ 2017లో తిరిగి అదే స్ధానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మరో ఘటనలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం మృత్యువాత పడ్డారు. బీజేపీలో కీలక నేతగా వ్యవహరించిన కళ్యాణ్ సింగ్ మరణంతో ఆ రాష్ట్ర బీజేపీ శాఖలో విషాదం నెలకొంది.