రెండో భార్యతో తిరుగుతున్న ఎమ్మెల్యే, ఇద్దర్నీ చితక్కొట్టిన మొదటి భార్య.. దెబ్బలు భరించలేక..
ముంబై: మహారాష్ట్రలో ఓ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేపై ఆయన భార్య, తల్లి చేయి చేసుకున్నారు. రెండో పెళ్ళి అంశంపై ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని అర్నిలో జరిగింది. వారు స్థానికులతో కలిసి ఎమ్మెల్యేను నడి రోడ్డుపై కొట్టారు. ఈ విషయం మీడియాకు ఆలస్యంగా తెలిసింది.
రెండో భార్యతో వెళ్తుండగా మొదటి భార్య దాడి
అర్నీ నియోజక వర్గ ఎమ్మెల్యే రాజు నారాయణ్ తోడ్సాం మంగళవారం తన రెండో భార్య ప్రియా షిండేతో కలిసి ఓ స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఘటన జరిగింది. రెండో భార్య కారణంగా తనను ఆయన (ఎమ్మెల్యే) పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ మొదటి భార్య అర్చన, ఆమె అత్త (ఎమ్మెల్యే తల్లి), స్థానికులతో కలిసి వచ్చారు. ఆమెకు ఎమ్మెల్యే తల్లి కూడా మద్దతు పలకడం గమనార్హం. రోడ్డుపై ఆయనను జనం అడ్డుకున్నారు.
దెబ్బలు తాళలేక ఎమ్మెల్యే రెండో భార్య ప్రాదేయపడింది
అనంతరం ఎమ్మెల్యే రెండో భార్య (ప్రియురాలుగా చెబుతున్నారు) ప్రియా షిండేపై అత్తయ్యతో కలిసి అర్చన దాడి చేసింది. వారిద్దరూ కురిపిస్తున్న పిడిగుద్దులకి తట్టుకోలేక తనను వదిలేయాలని ప్రియా ప్రాధేయపడింది. తన రెండో భార్యను కాపాడాలని ఎమ్మెల్యే ప్రయత్నించాడు. దీంతో మొదటి భార్య, తల్లి, ఇతర స్థానికులు ఆయనపై కూడా పిడిగుద్దులు కురిపించారు.
ఎమ్మెల్యేను, రెండో భార్యను కాపాడిన పోలీసులు
మొదటి భార్య అర్చన ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆయన సెక్యూరిటీ కూడా ఏం చేయలేకపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యేను, ఆయన రెండో భార్యను రక్షించి తమ వాహనంలో తీసుకెళ్లారు. రెండో భార్య ప్రియకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
రెండో భార్యతో ప్రజల మధ్య తిరగడం సిగ్గుచేటు
కాగా, ఎమ్మెల్యేను స్థానికులు కొడుతున్న దృశ్యాలను ఒకరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పలువురు మాట్లాడుతూ... విలువలను మర్చి ఓ ఎమ్మెల్యే ఇలా రెండో భార్యతో ప్రజల మధ్య తిరుగుతుండడం సిగ్గుచేటు అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్న అర్చనకు, తన ఇద్దరు పిల్లలకు మొదట న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో అమ్మాయి కోసం ఆయన తన కుటుంబాన్ని అన్యాయంగా వదిలేశాడన్నారు.
ప్రధాని మోడీ వస్తున్నాడు.. ఫిర్యాదు చేస్తాం, ఇరుకునపడిన బీజేపీ
ఎమ్మెల్యే నలభై ఎనిమిది గంటల్లో ఆమెకు న్యాయం చేయకపోతే తాము ఈ విషయాన్ని ఈ శనివారం ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శనివారం యవత్మాల్ జిల్లాకు వస్తున్నారు. ఈ ఘటనతో నారాయణ్ను ఆ సభకు రావద్దని బీజేపీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విదర్భలోని బీజేపీ గిరిజన విభాగ అధ్యక్షులు ఈ ఘటనపై మాట్లాడారు. ఎమ్మెల్యే తీరు తమ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. మహిళలందరూ అర్చనకే మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.