"ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా".. నోరు జారిన మంత్రి, సీఎంకు షాక్ !
బెంగళూరు: ఈ రోజు, మరుసటి రోజు అంటూ 25 రోజులు నానుతూ వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రివర్గం ఎట్టకేలకు ఏర్పాటు అయ్యింది. మంత్రులుగా చాల మంది దేవుడి మీద ప్రమాణస్వీకారం చేశారు. అయితే మధుస్వామి తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని నోరు జారడంతో సీఎం యడియూరప్పతో సహ అనేక మంది బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే మధుస్వామి కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే సమయంలో తీవ్ర స్థాయిలో వాదనలు వినిపించారు. కుమారస్వామి ప్రభుత్వం మీద బీజేపీ ఎమ్మెల్యే మధుస్వామి దుమ్మెత్తిపోశారు.
యడియూరప్ప ప్రభుత్వంలో మొదటి సారి మధుస్వామికి మంత్రి పదవి దక్కింది. మంగళవారం ఉదయం బెంగళూరులోని రాజ్ భవన్ లో మధుస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో మధుస్వామి మంత్రికి బదులు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని నోరుజారారు.
ఆ సమయంలో పక్కనే నిలబడి ఉన్న ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు, అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. వెంటనే విషయం గుర్తించిన మధుస్వామి నాలుక కరుచుకున్నారు.
తరువాత మధుస్వామి ఆయన మాటలు సరి చేసుకుని కర్ణాటక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని అనడంతో సీఎం యడియూరప్పతో పాటు అక్కడ ఉన్న బీజేపీ నాయకులు నవ్వుకున్నారు. మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మధుస్వామి పొరపాటున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని అన్నారని అక్కడ ఉన్న బీజేపీ నాయకులు అన్నారు. మొత్తం మీద మధుస్వామి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు అక్కడ ఉన్న బీజేపీ నాయకులు పెద్ద షాక్ ఇచ్చారు.