అహ్మద్ పటేల్ గెలుపు: మోడీ, షాలకు షాకిచ్చింది బీజేపీ ఎమ్మెల్యేనే, ఎందుకంటే?
గాంధీనగర్: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభసభ్యుడిగా ఎన్నికైన పరిణామంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
బీజేపీ ఎత్తుగడ
అయితే, ఇక్కడ ఖాళీ అయిన మూడు స్థానాల్లో ముగ్గురే పోటీ పడివుంటే.. ఎన్నికలు లేకుండా ముగ్గురూ ఎన్నికై ఉండేవారే. కానీ, మూడింటిలోనూ పాగా వేయాలన్న ఎత్తుగడతో బీజేపీ మరో వ్యక్తిని పోటీకి దింపింది.
కాంగ్రెస్ పార్టీకి అదే కలిసొచ్చింది..
కాగా, మొత్తం 176మందికి ఓట్లు ఉండగా, 45ఓట్లు వచ్చిన వారి విజయం ఖాయమవుతుంది. ఓటు వేసిన వారిలో ఇద్దరు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఓట్లను బయటకు చూపుతూ ఓటేసినందుకు వారి ఓట్లు చెల్లకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన మొదటి అంశం ఇదే.
దెబ్బకొట్టిన నళిన్..
ఆ తర్వాత పోలింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 43మంది అహ్మద్ పటేల్కు ఓటేశారు. అయితే, గెలుపు కోసం అవసరమైన ఆ 44వ ఓటు ఎవరు వేశారన్నదానిపై భిన్న వాదనలు వినిపించాయి. కాగా, అహ్మద్ పటేల్ను ఓటించాలని చూసిన బీజేపీ అధినేతలు అమిత్ షా, మోడీలకు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే నళిన్ కొటాడియా షాకిచ్చారు.
అందుకే బీజేపీకి వ్యతిరేకంగా..
ఈ విషయాన్ని కొటాడియానే స్వయంగా చెప్పడం గమనార్హం. పటీదార్ల ఆందోళన సందర్భంగా మరణించిన 14మంది యువకుల బాధ ఏమిటో నాకర్థమైంది.. అందుకే నా సొంత పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశానని నళిన్ కొటాడియా స్పష్టం చేశారు. ఈ మేరకు తను మాట్లాడుతున్న వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు కూడా.
కాంగ్రెస్ మాత్రం ఇలా..
నితిన్ ఓటే అమ్మద్ పటేల్ను గెలిపించినట్లు స్పష్టమవుతోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం జేడీయూ ఎమ్మెల్యే ఛోటూ భాయ్ లేదా ఎన్సీపీ లేదా జీపీపీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తమకు ఓటేసి ఉండవచ్చని చెబుతోంది. ఏది ఏమైనా.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన నళిన్.. బీజేపీకి గట్టి షాకే ఇచ్చారు.