బీజేపీ vs పోలీసులు: మాజీ ఉప ముఖ్యమంత్రి తలకు తీవ్రగాయాలు, కాంగ్రెస్ !
బెంగళూరు: మహాదాయి తాగునీటి ప్రాజెక్టు కోసం ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ తలకు తీవ్రగాయాలైనాయి.
బుధవారం బెంగళూరు నగరంలోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్, మాజీ మంత్రి అరవింద లింబావలి. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
కేపీసీసీ కార్యాలయం ముందు ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా బీజేపీ నాయకులు ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సందర్బంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు.
బీజేపీ నాయకులను అరెస్టు చేసే సమయంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది. బీజేపీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసే సమయంలో జరిగిన తోపులాటలో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తగలడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ తలకు తీవ్రగాయాలైనాయి.
వెంటనే పోలీసులు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ ను మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.