అమ్మాయిల కిడ్నాప్: వక్రీకరించారంటూ ఆ బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణ
ముంబై: పెళ్లి కాని అమ్మాయిలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ క్షమాపణలు తెలిపారు. ముంబై ఘట్కోపర్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ్ కదమ్ కృష్ణాష్టమి రోజున తన నియోజక వర్గంలో నిర్వహించిన దహీహండీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏ అమ్మాయి నుంచైనా అబ్బాయిలు తిరస్కరణకు గురైనట్లు తనకు తెలియజేస్తే సదరు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అబ్బాయి వద్దకు తీసుకొస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, తన ఫోన్ నంబరును కూడా రాసుకోండంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రతిపక్షనేతలు తీవ్ర విమర్శలు చేశారు.
మహిళలకు రక్షణ కరవైందని , బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళలకు రక్షణేదని ప్రతిపక్షపార్టీల నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రామ్ కదమ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎడిట్ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారని తెలిపారు.
తాను తప్పుగా మాట్లాడలేదని మీడియా ప్రతినిధులు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారని చెప్పారు. ఐనప్పటికీ తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఎడిట్ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఎమ్మెల్యేని అపఖ్యతిపాలు చేయడానికి ప్రతిపక్షాలు పన్నిన కుట్రని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.