అమ్మాయిలు సేఫ్గా ఉండాలంటే ఆ పనిచేయండి: బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే పన్నలాల్ శాక్య కాలేజీ అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. బాయ్ఫ్రెండ్స్ వద్దని, వారికి దూరంగా ఉంటేనే మంచిదని సూచించారు.
'అసలు అమ్మాయిలకు బాయ్ఫ్రెండ్స్ తో పనేంటి?, ఇలాంటివి మానేస్తే వాళ్లపై దురాగతాలే జరగవు.' అంటూ చెప్పుకొచ్చారు. గునా ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. అమ్మాయిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
'మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి ఇటీవలే ఓ చానెల్ నా అభిప్రాయం చెప్పమని అడిగింది. మీతో ఇప్పుడు ఏదైతే చెప్పానో వారికి కూడా అదే చెప్పాను' అని ఎమ్మెల్యే శాక్య పేర్కొన్నారు.
అమ్మాయిలనే కాదు అబ్బాయిలనూ మందలించారు ఎమ్మెల్యే శాక్య. గర్ల్ ఫ్రెండ్స్ను ఏర్పరుచుకోవడం పాశ్చాత్య సంస్కృతి అని చెప్పారు. అలాగే అంతార్జతీయ మహిళా దినోత్సవం అనేది కూడా విదేశీయుల సాంప్రదాయమని పేర్కొన్నారు.
'భారతీయ సిద్దాంతాల ప్రకారం మహిళను మనం అత్యున్నతంగా గౌరవిస్తాం. ప్రతీ సంవత్సరం నాలుగుసార్లు మహిళా దినోత్సవాన్ని జరుపుతాం. నాలుగుసార్లు వారిని ఆరాధిస్తాం..' అని చెప్పుకొచ్చారు.
కాగా, గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎమ్మెల్యే శాక్య వార్తల్లో నిలిచారు. గతడాది డిసెంబర్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇండియాలో పుట్టి పెరిగి, ఇక్కడ కీర్తి ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకుని ఇటలీలో వివాహం చేసుకోవడమేంటి? అని అప్పట్లో ఆయన ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ దేశభక్తుడు కాదని వ్యాఖ్యానించారు.