వివాదం: పాక్ జెండాతో బీజేపీ ఎమ్మెల్యే పోస్టర్
భోపాల్: పాకిస్థాన్ జెండాతో బీజేపీ ఎమ్మెల్యే ఉన్న పోస్టర్ ఒకటి మధ్య ప్రదేశ్లో పెద్ద సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే రాజధాని భోపాల్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్లో ‘పాకిస్థాన్' జెండా కూడా ఉంది.
మిలాద్ నబీ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ పోస్టర్ను ఒక కరెంట్ స్తంభంపై ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సరంగ్ ఫొటోతో పాటు ఆయన మద్దతుదారులు కూడా ఈ పోస్టర్లో ఉన్నారు. అయితే ఈ పోస్టర్ను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్లో పాకిస్థాన్ జెండా ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ మాట్లాడుతూ తన పోస్టర్ వార్త విని ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
ఆ పోస్టర్తో తనకేమీ సంబంధం లేదన్నారు. కొంతమంది అసాంఘిక శక్తులు కావాలనే ఈ పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనకు కారణం అసాంఘిక శక్తులేనని అన్నారు. ఈ విషయమై భోపాల్ డీజీపీ ఒక లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు. అసాంఘిక శక్తులు కొందరు సామాజిక మాధ్యమాల్లో తన పేరిట తప్పుడు సందేశాలను పంపుతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.