ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం, బంద్: బళ్లారి శ్రీరాములు యూటర్న్, ఓట్లు రాలేదని, ఫైర్ !
బెంగళూరు: జేడీఎస్ పార్టీ ఓట్లు వెయ్యలేదని ఒకే ఒక్క కారణంతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఉత్తర కర్ణాటకను నిర్లక్షం చేస్తూ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు మండిపడ్డారు. జేడీఎస్ పార్టీ ఉత్తర కర్ణాటకలో ఎలాంటి ప్రభావం చూపించలేదనే కసితో సీఎం కుమారస్వామి ఆ ప్రాంతాలను నిర్లక్షం చేస్తున్నారని బళ్లారి శ్రీరాములు విమర్శించారు. అయితే ఇప్పుడు తాను కర్ణాటకను విభజించడానికి ప్రయత్నం చెయ్యలేదని శ్రీరాములు యూటర్న్ తీసుకున్నారు.
శ్రీరాములు మద్దతు
ఉత్తర కర్ణాటకలోని అనేక జిల్లాల విషయంలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నిర్లక్షం చేసిందని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఆరోపించారు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాటానికి, ఆగస్టు 2వ తేదీ జరిగే బంద్ కు తన మద్దతు ఉంటుందని ఇటీవల బళ్లారి శ్రీరాములు ప్రకటించారు.
సీఎం మీద శ్రీరాములు ఫైర్
జులై 11వ తేదీ విధాన సౌధలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చ సందర్బంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్షం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్షం కారణంగా ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అసెంబ్లీ సమావేశంలో శ్రీరాములు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
ఆయన వ్యక్తిగతం
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాటానికి మద్దతు ఇవ్వడం శ్రీరాములు వ్యక్తిగతం అని, దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో పాటు అనేక మంది నాయకులు మీడియాకు చెప్పారు.
శ్రీరాములు యూటర్న్
అఖిల కర్ణాటక (అఖండ కర్ణాటక) అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఉత్తర కర్ణాటక - దక్షిణ కర్ణాటక అనే ప్రాంతీయ విభేదాలు లేకుండా సమానంగా చూడాలనే తాను కోరుకుంటున్నానని శ్రీరాములు సోమవారం ట్వీట్ చేశారు. ఉత్తర కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయించి జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటక ఏకీకరణ పోరాటాన్ని గౌరవించాలని శ్రీరాములు సీఎం కుమారస్వామికి సూచించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని అవినీతి, లోసుగులు కప్పిపుచ్చుకోవడానికి కొందరు స్వార్థపరులు నామీద ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని శ్రీరాములు విమర్శించారు.
శ్రీరాములు VSసిద్దూ
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాటానికి శ్రీరాములు మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కర్ణాటక ఏకీకరణ గురించి ఏమాత్రం అవగాహనలేని శ్రీరాములు మూర్ఖంగా మాట్లాడుతున్నారని సిద్దరామయ్య విమర్శించారు.