గాలి జనార్దన్ రెడ్డి కేసు తెలీదు, చట్టం తనపని తాను చేస్తోంది: నా ఫ్రెండ్: శ్రీరాములు!
బళ్లారి(కర్ణాటక): కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో ఆయన స్నేహితుడు బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు క్లారిటీ ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయం తనకు ఏ మాత్రం తెలీదని ,చట్టం తనపని తాను చేస్తోందని బళ్లారి శ్రీరాములు చెప్పారు.
బుధవారం బళ్లారిలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు మీడియాతో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుని వెలుతుందని శ్రీరాములు అన్నారు. చట్టం ముందు అందరూ సమానం అని శ్రీరాములు చెప్పారు. చట్టాన్ని ఎదురించి ఎవ్వరూ పెద్దవారు కాలేదని శ్రీరాములు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను ఇన్ని రోజులు బళ్లారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయం తనకు పూర్తిగా తెలీదని, పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత మాట్లాడుతానని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు వివరాలు తెలీకుండా తాను ఎలా మాట్లాడాలని శ్రీరాములు అసహనం వ్యక్తం చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి తన స్నేహితుడని, అందులో ఎలాంటి అనుమానం లేదని, ఈ విషయంపై తాను ఎక్కువగా మాట్లాడనని శ్రీరాములు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెద్దనోట్లు రద్దు అయిన సమయంలో తన దగ్గర ఉన్న పాతనోట్లు మార్చడానికి గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుల కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్న సమయంలో బళ్లారి శ్రీరాములు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.