వాల్మీకీలకు 7.5 శాతం రిజర్వేషన్లు: స్వామిజీ ఆదేశిస్తే రాజీనామా, ఏదీ శాస్వతం కాదు, బళ్లారి శ్రీరాములు
బెంగళూరు: ఎస్సీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని దావణగెరెలో మొదలైన పాదయాత్ర మంగళవారం బెంగళూరు చేరుకుంది. వాల్మీకీ కులస్తుల రిజర్వేషన్ల సాధనకు శ్రీ రాజనహళ్ళి స్వామిజీ ఆదేశిస్తే ఇక్కడే రాజీనామా చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు అన్నారు. అయితే రాజీనామాల వలన సమస్యలు పరిష్కారం కావని, పదవిలో ఉంటూ మీ హక్కులు కాపాడుకోవాలని శ్రీ రాజనహళ్ళి స్వామీజీ సూచించారు.
భారీ పాదయాత్ర
వాల్మీకులకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని రాజనహళ్ళిలోని వాల్మీకీ గురుపీఠ ప్రసన్నానంద పురి స్వామీజీ ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన బెంగళూరుకు భారీ పాదయాత్ర చేపట్టారు. జూన్ 7వ తేదీ మొదలైన పాదయాత్ర జూన్ 25వ తేదీ మంగళవారం బెంగళూరుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో వేలాది మంది వాల్మీకీ కులస్తులు పాల్గొన్నారు.
విధాన సౌధ ముట్టడి
దావణగెరె జిల్లా నుంచి మొదలైన పాదయాత్ర బెంగళూరు చేరుకోవడంతో మంగళవారం వాల్మీకి కులస్తులు విధాన సౌధ ముట్టడించారు. అనంతరం ఫ్రీడం పార్క్ లో ధర్నా నిర్వహించి వాల్మీకీలకు 7.5 శాతం రిజ్వర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ధర్నాను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు మాట్లాడారు.
అన్యాయం జరిగింది
వాల్మీకీ కులస్తులకు అన్ని విదాలుగా అన్యాయం జరిగిందని బళ్లారి శ్రీరాములు ఆరోపించారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కర్ణాటక ప్రభుత్వాన్ని శ్రీరాములు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ల సాధన కోసం వాల్మీకీలు పోరాటం చేస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని శ్రీరాములు మండిపడ్డారు. దావణగెరె జిల్లా నుంచి మొదలైన పాదయాత్ర నేడు బెంగళూరు చేరుకుందని, పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పోరాటం వృదా కాదని శ్రీరాములు చెప్పారు.
స్వామీజీల భిక్ష
తాను ఎమ్మెల్యే పదవిలో ఉండటానికి కారణం స్వామిజీలు అని శ్రీరాములు అన్నారు. మా హక్కుల కోసం రోడ్ల మీదకు వస్తే మేము ఎవ్వరి మాట వినమని శ్రీరాములు చెప్పారు. వాల్మీకి కుల స్వామీజీలు పెట్టిన భిక్ష, వారి ఆశీర్వాదంతో మేము రాజకీయాల్లో ఉన్నామని శ్రీరాములు గుర్తు చేశారు. వాల్మీకీల హక్కుల కోసం మీరు ఆదేశిస్తే ఇదే వేదిక మీద రాజీనామా చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని శ్రీరాములు అన్నారు.
ఏదీ శాస్వతం కాదు
జీవితంతో ఏదీ శాస్వతం కాదని, తాము సమాజం కోసం పోరాటం చేస్తున్నామని శ్రీరాములు అన్నారు. ఈ రోజు ప్రాణాలతో ఉన్నాం, రేపు ప్రాణాలతో ఉంటామో లేదో తెలీదు, జీవితంలో ఏదీ శాస్వతం కాదని, ఉన్నంత కాలం ప్రజల కోసం మంచి పనులు చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని శ్రీరాములు అన్నారు. వాల్మీకీల హక్కుల సాధించే వరకూ ఈ పోరాటం ఆగదని, విధాన సౌధ హడలిపోవాలని చెప్పారు. జూన్ 7వ తేదీ మొదలైన పాదయాత్ర జగళూరు, చిత్రదుర్గ, చళ్ళకెరె, హిరయూరు, శిరా, తుమకూరు, నెలమంగల, దోడ్డబళ్ళాపుర, దేవనహళ్ళి, హోసకోటే, కేఆర్ పురం మీదుగా బెంగళూరు చేరుకుంది.