బీజేపీ మీద బళ్లారి శ్రీరాములు అసంతృప్తి , గాలి బ్రదర్స్ కు చెక్: ఎంపీ సీటు: వార్నింగ్, అప్పకు షాక్ !
బళ్లారి: 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారు. అయితే ఆ జాబీతాలో మాత్రం బళ్లారి లోక్ సభ అభ్యర్థి పేరు ఉండదని బీఎస్ యడ్యూరప్ప చెప్పడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. యడ్యూరప్ప వ్యాఖ్యలతో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు గుర్రుగా ఉన్నారు. తన సోదరి, మాజీ ఎంపీ శాంతా, లేదా తాను సూచించిన అభ్యర్థి పేరు ప్రకటించాలని శ్రీరాములు వార్నింగ్ ఇవ్వడంతో అప్ప షాక్ కు గురైనారు. గాలి బ్రదర్స్ కు చెక్ పెట్టడానికే ఇలా చేస్తున్నారని సమాచారం.
సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !
బళ్లారి కంచుకోట
గత కొన్ని సంవత్సరాల క్రితం బళ్లారి బీజేపీకి కంచుకోట. అలాంటి బళ్లారిలో నేడు బీజేపీ అభ్యర్థి చిక్కడం లేదు అనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక చాల పెద్ద కథ ఉందని తెలిసింది. బళ్లారిలో సరైన అభ్యర్థిని పోటీ చేయించి ఆ సీటు కైవసం చేసుకోవాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బ
గత సంవత్సరం జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో బళ్లారి నుంచి ఎమ్మెల్యే శ్రీరాములు సోదరి, మాజీ ఎంపీ శాంతా, కాంగ్రెస్ నుంచి ఉగ్రప్ప పోటీ చేశారు. అయితే ఊహించని రీతిలో ఉగ్రప్ప ఎంపీగా విజయం సాదించడంతో శ్రీరాములుతో పాటు బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. ఇలాంటి సమయంలో శాంతాకు కాకుండే వేరే వ్యక్తిని ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రీరాములు అసంతృప్తి
బళ్లారి లోక్ సభ ఎన్నికల్లో సరైన అభ్యర్థితో పోటీ చేయించాలని బీజేపీ నాయకులు అంటున్నారు. సరైన అభ్యర్థి కోసం బీజేపీ నాయకులు గాలిస్తున్నారు. ఈ విషయంలో బళ్లారి శ్రీరాములు అసంతృప్తితో ఉన్నారు. తన రాజకీయ గురువు బీఎస్ యడ్యూరప్ప అని బహిరంగంగా చెప్పుకునే శ్రీరాములు ఈ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక బీజేపీ నాయకుల తీరుపై శ్రీరాములు మండిపడుతున్నారు.
గాలి బ్రదర్స్ దెబ్బ
బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి సోదరుల పెత్తనానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో లోక్ సభ ఎన్నికల్లో శ్రీరాములు సోదరి శాంతాకు టిక్కెట్ ఇవ్వడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి సోదరుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆ ప్రభావం పార్టీ మీద పడే అవకాశం ఉందని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. నిజాయితీ పరుడు, ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తితో బళ్లారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఆ పార్టీ జాతీయ నాయకుడు సంతోష్ జీ హై కమాండ్ కు మనవి చేశారు.
బరిలో ఇద్దరు వైద్యులు
శ్రీరాములు సోదరి శాంతాకు బదులుగా బళ్లారికి చెందిన ప్రముఖ వైద్యుడు సుందర్ కు సీటు ఇవ్వాలని కొందరు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలో టిక్కెట్ కోసం డాక్టర్ సుందర్ చివరి వరకు ప్రయత్నాలు చేశారు. ఆ విషయాలు అన్ని పరిగణలోకి తీసుకున్న సంతోష్ జీ సుందర్ కు ఎంపీ సీటు ఇవ్వాలని హైకమాండ్ కు మనవి చేశారు. డాక్టర్ సుందర్ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు సన్నిహితుడు. బళ్లారికి చెందిన మరో ప్రముఖ వైద్యుడు టీఆర్ శ్రీనివాస్ సైతం ఎంపీగా పోటీ చెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నామినేషన్ సమర్పించిన డాక్టర్ శ్రీనివాస్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
అయోమయంలో అప్ప
తన సోదరి శాంతాకు కాకుండా వేరే వ్యక్తిని ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను సూచించిన వ్యక్తిని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించకుంటే తాను ఎన్నికల ప్రచారంలో సహకరించనని శ్రీరాములు హెచ్చరించారని సమాచారం. శాంతాకు లేదా శ్రీరాములు సూచించిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. అయితే హైకమాండ్, బీజేపీలోని ఇతర నాయకుల మాటకు యడ్యూరప్ప కట్టుబడి ఉండాలి. ప్రస్తుతం యడ్యూరప్ప పరిస్థితి అయోమయంగా ఉంది.