సీఎంను మాజీ పీఎం దేవేగౌడ నిద్రపోనివ్వరు, రాజకీయ చదరంగం: కాంగ్రెస్ బలి: మాజీ మంత్రి !
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని మనఃశాంతిగా పని చేసుకోవడానికి అవకాశం ఇవ్వరని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. సోమణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఎవ్వరినీ మనఃశాంతిగా ఉండనివ్వరని, అది ఆయన కొడుకు అయినా సరే వదిలిపెట్టరని బీజేపీ నాయకుడు వి. సోమణ్ణ ఆరోపించారు. మంగళవారం తుమకూరులోని సిద్దగంగా మఠంకు భేటీ అయిన వి. సోమణ్ణ మీడియాతో మాట్లాడతూ దేవేగౌడ ఎవ్వరినీ నిద్రపోనివ్వరని ఆరోపించారు.
దేవేగౌడ గారడి
దేవేగౌడ రాజకీయ గారడిలో తాను పెరిగానని, ఆయన రాజకీయ చదరంగం తాను దగ్గర నుంచి చూశానని బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ అన్నారు. జేడీఎస్ తో పొత్తుపెట్టుకున్న పార్టీలను మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారని బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ ఆరోపించారు.
ప్రజలు టార్గెట్
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ రాజకీయంగా ఆటలు ఆడటానికి ప్రజలను పావులుగా ఉపయోగించుకుంటారని వి. సోమణ్ణ ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని, అధికారులను ఎవ్వరినీ మనఃశాంతిగా పని చేసుకోవడానికి దేవేగౌడ విడిచిపెట్టరని వి. సోమణ్ణ విమర్శించారు.
యడ్యూరప్ప సీఎం
బీజేపీ అధికారంలోకి వస్తే బీఎస్. యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీతో జేడీఎస్ పొత్తుపెట్టుకుందని వి. సోమణ్ణ ఆరోపించారు. దేవేగౌడ ఆడుతున్న రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ బలిపశువు అయ్యిందని వి. సోమణ్ణ వ్యంగంగా అన్నారు.
ఎవరి మాట వినరు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఎవ్వరిమాట వినరని, ఆయన మనసులోని ఆలోచనలు సంకీర్ణ ప్రభుత్వం మీద వేసి పనులు చేయించుకుంటారని వి. సోమణ్ణ ఆరోపించారు. కొడుకు కుమారస్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా దేవేగౌడ మనసులోని ఆలోచనలతోనే సీఎంగా ఆయన పనులు చేస్తారని, ఇది ప్రజలకు మంచిదికాదని వి. సోమణ్ణ విమర్శించారు.