బిహార్ అసెంబ్లీ స్పీకర్గా విజయ్ కుమార్ సిన్హా... ఆ స్థానంలో మొట్టమొదటి బీజేపీ నేత...
బిహార్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్గా ఎన్నికయ్యారు. బుధవారం(నవంబర్ 25) అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హాకు 122 ఓట్లు రాగా.. మహాకూటమి అభ్యర్థి అవధ్ బిహారీ చౌధురికి 114 ఓట్లు వచ్చాయి. 12 ఓట్ల మెజారిటీతో విజయ్ కుమార్ సిన్హా స్పీకర్గా ఎన్నికయ్యారు. ఓటింగ్ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది.
ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ రహస్య ఓటింగ్ కోసం పట్టుబడగా.. ప్రొటెం స్పీకర్ జీతన్ రాం మాంఝీ మూజువాణి ఓటు ద్వారా ఓటింగ్ నిర్వహించారు. సభలో రూల్ బుక్ను ఫాలో కావాలంటూ తేజస్వి అభ్యంతరం లేవనెత్తడంతో... హెడ్ కౌంట్ చేపట్టారు. స్పీకర్ ఎన్నిక అనంతరం సభా సంప్రాదాయం ప్రకారం సీఎం నితీశ్, ఉప ముఖ్యమంత్రులు తార్ కిశోర్, రేణుదేవి, ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ కొత్త స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను మర్యాదపూర్వకంగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.
స్పీకర్ ఎన్నిక జరుగుతున్న సమయంలోనే... అసెంబ్లీలో సభ్యులు కానివారు సభలో ఉండకూడదంటూ తేజస్వి డిమాండ్ చేయడంతో సభలో దుమారం రేగింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఉద్దేశించి తేజస్వి ఆ డిమాండ్ చేశారు. అయితే ప్రొటెం స్పీకర్ జీతన్ రాం మాంఝీ అందుకు తిరస్కరించారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీగా ఉన్న సమయంలోనూ అసెంబ్లీకి వచ్చారని గుర్తుచేశారు. మండలి సభ్యులు అసెంబ్లీలో ఓటు వేయరని... అలాంటప్పుడు సభలో వారు ఉండటం ఇబ్బందేమీ కాదన్నారు.
బీజేపీ స్పీకర్ ఎన్నికకు తమ అభ్యర్థిని నిలబెట్టడం ఇదే తొలిసారి. గతంలో ఎన్డీయూ కూటమి భాగస్వామి జేడీయూ తమ అభ్యర్థిని నిలబెట్టేది. ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు రావడంతో స్పీకర్ పదవికి సొంత అభ్యర్థిని నిలబెట్టింది. బిహార్ కొత్త స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా భూమిహార్ సామాజికవర్గానికి చెందిన నేత. ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కాగా,ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ 74స్థానాల్లో,జేడీయూ 43స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తంంగా మహాకూటమి ఎన్డీయే కూటమి 125స్థానాల్లో విజయం సాధించగా,మహాకూటమి110 స్థానాల్లో విజయం సాధించింది.