ఈవీఎంలపై ఇలా..: కేజ్రీ పార్టీ చెప్పిన బ్రేకింగ్ న్యూస్, బీజేపీ ఆందోళన
ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం ఈవీఎంల ట్యాంపరింగ్, నీటి కుంభకోణంపై రగడ చోటు చేసుకుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చునని ఏఏపీ నేత సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం ఈవీఎంల ట్యాంపరింగ్, నీటి కుంభకోణంపై రగడ చోటు చేసుకుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చునని ఏఏపీ నేత సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బ్రేకింగ్ న్యూస్ చెప్పనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకుముందే ప్రకటించింది. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ పైన చెప్పడమే ఆ బ్రేకింగ్ న్యూస్ అని తేలింది.
ఎంబెడెడ్ సిస్టమ్స్లో పదేళ్ల అనుభవం ఉన్న ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేస్తారో డెమో ఇచ్చారు. సభలోకి ఈవీఎంను తీసుకొచ్చి మరీ వివరణ ఇచ్చారు.
ఎన్నికల ముందు ఈవీఎంలను ఎలా పరిశీలిస్తారు. ఓటు వేస్తే ఎలా రికార్డ్ అవుతుంది.. లాంటివన్నీ ఈ డెమోలో చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పాతతరం ఈవీఎంలను వాడారని, వాటిని సులువుగా ట్యాంపర్ చేయొచ్చని చెప్పారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు. తొలుత ఈవీఎంల అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా లేవనెత్తారు. ఆ తర్వాత సౌరభ్ సభ నుంచి బయటకు వెళ్లి.. ఈవీఎంను తీసుకొచ్చి వివరణ ఇచ్చారు.
తొలి రెండు గంటల్లోనే ఓట్లు సరిగా పడతాయని ఈవీఎం ట్యాంపరింగ్ డెమో సందర్భంగా సౌరబ్ భరద్వాచ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నుంచి మాత్రం ఓట్లు బీజేపీకి పడేలా సెట్ చేశారన్నారు. ఈ సమావేశాలకు తృణమూల్ కాంగ్రెస్, జేడీయూలను ఆహ్వానించారు.
మరోవైపు, నీటి కుంభకోణం కేసులో రూ.2 కోట్లు తీసుకున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని బీజేపీ నేతలు సభలో ప్రస్తావించారు. ఈ అంశంపై చర్చించాలని, కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులు విజేందర్ గుప్తాను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో అసెంబ్లీ బయట వారు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
మార్షల్స్తో బలవంతంగా...
శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేను మార్షల్స్ బలవంతంగా బయటికి గెంటేశారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదాలపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి 43 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.