కొత్త స్పీకర్ వచ్చేశారు..! సీనియర్ ఎమ్మెల్యే నామినేషన్.. పోటీ లేనట్టే
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి మంగళవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిర్సి నుంచి ఆయన ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం పడిపోవటం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని విశ్వేశ్వర్ హెగ్డేతో భర్తీ చేస్తోంది ముఖ్యమంత్రి యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ సర్కార్.
యడియూరప్ప సహా పార్టీకి చెందిన ఇతర నాయకులు వెంట రాగా.. విశ్వేశ్వర్ హెగ్డే ఈ ఉదయం శాసనసభ కార్యదర్శి ఎంకే విశాలాక్షికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ పదవి కోసం పోటీలో ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఫలితంగా- ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమైంది. ఆయనను అభినందిస్తూ యడియూరప్ప పుష్పగుచ్ఛాలను కూడా అందజేశారు.
అదృశ్యానికి కొన్ని గంటల ముందు..ఏం జరిగిందంటే! కారు డ్రైవర్ వాంగ్మూలం
యడియూరప్పతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, ఈశ్వరప్ప తదితరులు విశ్వేశ్వర్ హెగ్డే వెంట ఉన్నారు. నిజానికి- బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత, విరాజ్ పేట ఎమ్మెల్యే కేజీ బోపయ్యను స్పీకర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. ఆయనకు స్పీకర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. రాత్రికి రాత్రి ఆయన స్థానంలో విశ్వేశ్వర్ హెగ్డేను తెర మీదికి తీసుకొచ్చారు. ఆయనతో నామినేషన్ దాఖలు చేయించారు.