ఐఏఎస్ అధికారి రాజీనామా, పాకిస్థాన్ వెళ్లిపో, పోరాటం చేస్తావా ? అదే నీకు కరెక్ట్, బీజేపీ ఎంపీ!
బెంగళూరు: ప్రభుత్వం తీరుతో విసుగు చెంది ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసిన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాధికారి (ఐఏఎస్ అధికారి) శశికాంత్ సెంథిల్ పాకిస్థాన్ వెళ్లి భారత్ మీద పోరాటం చెయ్యాలని, అదే నీకు కరెక్ట్ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వివాదస్పాద వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచారు.
ఔను, మోడీ మరిచిపోయి ముంబై మెట్రో కోసం వెళ్లిపోయారు, షాక్ లో బీజేపీ లీడర్స్ !
వివాదాస్పదంలో నెంబర్ 1
వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంలో కేంద్ర మాజీ మంత్రి, ఉత్తర కన్నడ ఎంపీ అనంత్ కుమార్ ముందు వరసలో ఉంటారు. ఈ దేశంలో ఉండటం బదులు పాకిస్థాన్ వెళ్లిపోవాలని, అక్కడ మీ నీతి నిజాయితీ నిరూపించుకోవాలని ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కు బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సూచించారు.
నీకు పాకిస్థాన్ కరెక్ట్
నువ్వు మొదట చెయ్యవలసిన పని పాకిస్థాన్ వెళ్లిపోవడం. అక్కడ నీకు మద్దతు ఇచ్చే వాళ్లు చాల మంది ఉంటారని తాను అనుకుంటున్నానని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. నువ్వు పాకిస్థాన్ తో కలిసి భారత్ మీద పోరాటం చెయ్యడం నీకు సరైన ఉద్యోగం అని నేను భావిస్తున్నానని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారత్ మీద పోరాటం !
ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేకపోతే మౌనంగా ఇంట్లో ఉండాలని, ఇలా ప్రభుత్వాల మీద ఆరోపణలు చెయ్యడం మంచిదికాదని ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కు బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సూచించారు. భారత్ మీద పోరాటం చెయ్యాలంటే నీకు పాకిస్థాన్ సరైన చోటు అని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వ్యంగంగా ట్వీట్ చేశారు.
కాశ్మీర్, త్రిబుల్ తలాక్, రామ మందిరం
దక్షిణ కన్నడ జిల్లాధికారిగా పని చేస్తున్న శశికాంత్ సెంథిల్ ఈనెల 6వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నానని ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీరుతో విసుగు చెందానని, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చెయ్యడం, త్రిబుల్ తలాక్ పై నిర్ణయం, రామ మందిరం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కలత చెందానని, అందుకే రాజీనామా చేశానని శశికాంత్ సెంథిల్ అన్నారని ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
బీజేపీ కౌంటర్
అవినీతిలో కూరుకుపోయిన ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఎక్కడ ఆయన బండారం బయట పడుతుందనే భయంతో ఉద్యోగానికి రాజీనామా చేశారని కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మీ అవినీతి గురించి ప్రజలకు తెలిసిపోయిందనే భయంతో రాజీనామా చేశారా ? అని కొందరు బీజేపీ నాయకులు శశికాంత్ సెంథిల్ ను ప్రశ్నిస్తున్నారు.