భారత స్వాతంత్ర్య పోరాటం పెద్ద డ్రామా.. అప్పట్లో ఒక్కరైనా దెబ్బలు తిన్నారా?: బీజేపీ ఎంపీ హెగ్డే
''సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలకు భయపడి బ్రిటిషోళ్లు ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చారంటే ఏమైనా నమ్మశక్యంగా ఉందా? అసలీ చరిత్ర చదివితే నా నెత్తురు మరిగిపోతుంది. భారత స్వాతంత్ర్య పోరాటం అనేది పెద్ద డ్రామా. పూర్తిగా బ్రిటిషర్ల కనుసన్నల్లో సాగిన ఉత్తుత్తి నాటకం. ఆంగ్లేయులకు విసుగొచ్చి, ఫ్రస్ట్రేషన్తో వెళ్లిపోయేతప్ప గాంధీకో, మరొకరికో జడిసి కాదు''అంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారంరేపుతున్నాయి.
అదే నిదర్శనం..
రెచ్చగొట్టే కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే తన సొంత నియోజకవర్గం ఉత్తర కన్నడలో ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కామెంట్లుచేశారు. స్వాతంత్ర్యం పేరుతో జరిగింది నిజమైన పోరాటం కానేకాదని, సర్దుబాట్ల ఆరాటం తప్ప జరిగిందేమీలేదని ఎంపీ అన్నారు. అప్పట్లో జాతీయ నాయకులుగా పేరుపొందిన ఏ ఒక్కరు కూడా కనీసం లాఠి దెబ్బలు తిన్న దాఖలాలు లేవని, భారత స్వాతంత్ర్య పోరాటం నూటికి నూరుశాతం బ్రిటిష్ వాళ్ల సంపోర్టుతోనే జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శం ఉండదని చెప్పారు.
మహాత్ముడంటే మంట..
దేశచరిత్రలో గాంధీని మించిన బూటకవాది లేరరని, సత్యాగ్రహం, నిరాహార దీక్షల పేరుతో ఆయన నాటకాలాడారని బీజేపీ ఎంపీ విమర్శించారు. జీవితాంతం బ్రిటిషర్లు చెప్పినట్లు బతికిన గాంధీని మహాత్ముడు అని ఎలా అంటారో అర్థంకావడంలేదని, ‘గాంధీజీ నాయకత్వంలో భారతస్వాతంత్ర్య పోరాటం జరిగింది'అని ఎవరైనా చెప్పినా, అలాంటి వాక్యాల్ని చరిత్రలో చదివినా నెత్తురు మసిలిపోయేంత కోపం వస్తుందని అనంతకుమార్ హెగ్డే చెప్పుకొచ్చారు.
బ్రిటిష్ చెంచాలకు అంతే..
దేశస్వాతంత్ర్య పోరాటం, మహాత్మా గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గీల్.. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ అప్పట్లో బ్రిటిషర్లకు క్షమాపణ లేఖలు రాయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘నిజమే బ్రిటిషర్ల చెంచాలు, తొత్తులకు భారతస్వాతంత్ర్య పోరాటం డ్రామాల కనిపించడం సహజమే''అని మండిపడ్డారు. ఎంపీ హెగ్డే వ్యాఖ్యలతర్వాతైనా బీజేపీ తన పేరును ‘నాథూరాం గాడ్సే పార్టీ'గా మార్చుకుంటే మంచిదని సూచించారు.
మోదీ స్పందిస్తారా?
ఎంపీ హెగ్డే కామెంట్లపై కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కూడా స్పందించారు. గాడ్సేని దేశభక్తుడన్న బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను జీవితాంతం క్షమించలేనన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు వాళ్ల పార్టీకే చెందిన మరో ఎంపీ హెగ్డే వ్యాఖ్యలపై ఎలా రియాక్టవుతారో చూడాలని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని సింఘ్వీ అన్నారు.
క్షమాపణ చెప్పాలన్న బీజేపీ
పార్టీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ హైకాండ్ స్పందించింది. గాంధీజీ స్వాతంత్ర్య పోరాటాన్ని తక్కువచేసి మాట్లాడినందుకు తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎంపీని ఆదేశించింది. హెగ్డే కామెంట్లకు పార్టీ ఐడియాలజీతో సంబంధం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పార్టీ అభిప్రాయపడింది.