ఆంధ్రా కిమ్ జోంగ్ జగన్ -ఉత్తర కొరియాలా పశ్చిమ బెంగాల్ - క్రేజీ నేత పేరుతో ప్రత్యర్థులపై బీజేపీ ఎదురుదాడి
''పాకిస్తాన్.. తాలిబాన్.. దేశ ద్రోహులు.. ఉగ్రవాదులు.. హిందూ వ్యతిరేకులు.. ముల్లా వారసులు.. '' వీటిలో ఏ ఒక్క పదమైనా లేకుండా బీజేపీ నేతలు మాట్లాడలరా? అనేది చాలా కాలంగా విపక్షాలు అడుగుతోన్న ప్రశ్న. బహుశా దానికి సమాధానంగానేమో, కమలనాథులు ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పేరును అతిగా వాడుతున్నారు. ప్రత్యర్థుల ఇలాకాలను ఉత్తర కొరియాతో పోల్చుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ నేతలు కిమ్ నామస్మరణ చేయడం చర్చనీయాంశమైంది..
జేపీ నడ్డాపై భయానక దాడి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన కోసం గురువారం వెస్ట్ బెంగాల్ వెళ్లగా.. 24నార్త్ పరగణా జిల్లాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై భయానక రీతిలో దాడి జరిగింది. నడ్డా రాకను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి, అడ్డంగా బ్యారికేడ్లు పెట్టడంతోపాటు బీజేపీ నేతల కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనలో పలువురు బీజేపీ ఎంపీలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో తాను బచాయించానని నడ్డా చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై..
నార్త్ కొరియాలా వెస్ట్ బెంగాల్..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై టీఎంసీ శ్రేణులు దాడి చేయడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ మహతో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వెస్ట్ బెంగాల్ ను నార్త్ కొరియాతో పోల్చారు. సీఎం మమతా బెనర్జీ కరడుగట్టిన నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నడ్డా కాన్వాయ్ రూట్ మ్యాప్ కు సంబంధించి బెంగాల్ పోలీసులకు ముందే సమాచారం ఉన్నప్పటికీ, టీఎంసీ గుండాలను అడ్డుతొలగించడంలో వారు ఉదాసీనంగా వ్యవహరించారని, పోలీసుల ముందే నిలబడి టీఎంసీ శ్రేణులు రాళ్లు విసిరాయని బీజేపీ నేత కైలాస్ విజయ్ వర్గియా ఆరోపించారు.
రాష్ట్రపతి పాలన.. మమతకు చరమగీతం
ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపైనే ఇంత దారుణంగా దాడి జరగడం వెస్ట్ బెంగాల్ లో అదుపు తప్పిన పరిస్థితులకు అద్దం పడుతున్నదని బీజేపీ ఎంపీ మహతో అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేలా వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ బృందం త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తుందని మహతో చెప్పారు. మమతా బెనర్జీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బెంగాలీలు నిర్ణయించుకున్నారని, 2021 మేలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే మమత భరతం పడతారని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..
ఆంధ్రా కిమ్ జగన్ -వైఎస్ భారతి సీఎం
వెస్ట్ బెంగాల్ ను నార్త్ కొరియాతో పోల్చుతూ బెంగాల్ బీజేపీ నేతలు విమర్శలు చేయడానికి కొద్ది గంటల ముందు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సైతం కిమ్ జోంగ్ పేరిట ఆరోపణలకు దిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని, ఏపీలో నియంత పాలన సాగుతోందని ఆరోపించారు. రెండేళ్ల తర్వత కేబినెట్ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానన్న జగన్.. సీఎం సీటును కూడా ప్రక్షాళన చేయాలని, ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంగా జగన్ తన భార్య వైఎస్ భారతిని కూర్చోబెడితే ప్రజలు కూడా సంతోషిస్తారని, కనీసం మహిళ పాలనలోనైనా ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నానని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు.
RRR:వైసీపీకి మేకు -జగన్కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ