బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు: పెరుగుతున్న ముస్లిం జనాభాతోనే దేశంలో అత్యాచారాలు హత్యలు
ఉత్తర్ ప్రదేశ్ : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్గా మారుతున్నారు బీజేపీ ప్రజాప్రతినిధులు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ హరిఓం పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభా పెరిగిపోతుండటం వల్లే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని చెప్పారు. అంతేకాదు త్వరలో భారత్ నుంచి పాకిస్తాన్లా మరో దేశం ఆవిర్భవిస్తుందని పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పాండే.. ప్రభుత్వం ముస్లిం జనాభా పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. " ఉగ్రవాదం, అత్యాచారాలు, లైంగిక వేధింపులు భారత్లోనే జరుగుతున్నాయంటే ఇందకు కారణం పెరుగుతున్న ముస్లిం జనాభానే. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభాలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది" అని హరిఓం పాండే అన్నారు. జనాభా పెరుగుదలతో ఉపాధి కల్పించలేని పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న ఎంపీ... ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.
ముస్లిం జనాభాను నియంత్రించేందుకు త్వరలోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని హరిఓం పాండే అన్నారు. భారత్ మళ్లీ రెండు దేశాలుగా విడిపోకముందే ఈ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టం చేయాలని హరిఓం పాండే సూచించారు.