జనాభా పెరుగుదల వల్లే: ముంబై ప్రమాదంపై హేమమాలిని
ముంబై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, నటి హేమమాలిని ముంబై ప్రమాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదానికి అధిక జనాభానే కారణం అన్నారు.
ముంబైలో పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సి ఉందన్నారు.
ముంబైలోని కమాలమిక్స్ కాంపౌండులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మీడియా ప్రతినిధులు పార్లమెంటు వెలుపల అడిగారు.
పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదని, వారు బాగా పని చేస్తున్నారని, ముంబైలో విపరీత జనాభా ఉందని, ముంబై తర్వాత అలా మరో నగరం తయారు కావాలని, కానీ ఈ నగరం విస్తరిస్తూనే ఉందని, నియంత్రణ లేకుండా పోతోందన్నారు. ప్రతి నగరానికి జనాభా విషయంలో పరిమితి ఉండాలన్నారు. పరిమితి దాటాక అనుమతించవద్దన్నారు.