కోట్లు విలువ చేసే భూమిని హేమామాలినికి 70 వేలకే
ముంబై: వందల కోట్లు విలువ చేసే భూమిని బీజేపీ ఎంపీ హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా కట్టబెట్టిన ఉదంతం ఆర్టీఐ ద్వారా వెలుగు చూసింది. ముంబై మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన అంథేరీలో 2000 చదరపు మీటర్ల స్థలం కేవలం రూ. 70 వేలకే హేమమాలినికి ధరాదత్తం చేసింది.
దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీఐ కార్యకర్త అనిల్ గాల్గాలీ ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించారు. చదరపు మీటరుకు రూ. 35 చొప్పున ధర నిర్ణయించి ఆమెకు సబర్బన్ కలెక్టర్ స్థలం కేటాయించారని రికార్డులో నమోదైంది.
సాంస్కృతిక ప్రయోజల కోసం హేమమాలిని ట్రస్టుకు ఈ భూమి అప్పగించామని, 1976 నియమాల ప్రకారం ధర నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు కోసమే ఆమెకు ఆ స్థలం కేటాయించినట్టు ఆయన తెలిపారు.
బీజేపీ ఎంపీ అవడం వల్లే హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం అనకూలంగా వ్యవహరించిందని ఆర్టీఐ కార్యకర్త అనిల్ గాల్గాలీ ఆరోపించారు. ఈ విషయమై మహా సీఎం ఫడ్నవీస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఆమెకు వెర్సోవా ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించగా ఇప్పటివరకు అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు.