విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు, విమర్శలు !
న్యూఢిల్లీ: నవంబర్ 17వ తేదీ ఛండీగడ్ లో సామూహిక అత్యాచారానికి గురైన 22 ఏళ్ల విద్యార్థిని విషయంలో బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కిర్రో ఖేర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాల్లో నటించి, ఎంపీగా ఉన్న కిర్రోన్ ఖేర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో సహ విపక్షాలు మండిపడుతున్నాయి.
కిర్రోన్ ఖేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చంఢీగడ్ లో ఓ ఆటో డ్రైవర్, అతని ఇద్దరు స్నేహితులు విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ కిర్రోన్ ఖేర్ మగవాళ్లు ఉన్న ఆటోలో ఆమె ఎందుకు ఎక్కిందని ప్రశ్నించారు.
ఆటోలో ముగ్గురు ఉన్నారు కదా ?
ఆటోలో అప్పటికే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాదా, అలాంటప్పుడు ఆ యువతి అదే ఆటో ఎక్కాల్సింది కాదని కిర్రోన్ ఖేర్ అన్నారు. పరిస్థితులు మారుతున్నప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అంటూ బీజేపీ ఎంపీ కిర్రోన్ ఖేర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నేను కారు నెంబర్లు రాసుకున్నా !
తాను ముంబైలో ఉన్న రోజుల్లో టాక్సీల్లో ప్రయాణించేదాన్ని అని కిర్రోన్ ఖేర్ గుర్తు చేశారు. తాను ట్యాక్సీల్లో ప్రయాణించే సమయంలో వాటి నంబర్లను రాసుకోవటం అలవాటు చేసుకున్నానని కిర్రోన్ ఖేర్ వివరించారు. మీడియా కూడా ఇలాంటి సమయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించకూడదని బీజేపీ ఎంపీ కిర్రోన్ ఖేర్ సలహా ఇచ్చారు.
విమర్శల పాలైన బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ కిర్రోన్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. అత్యాచార బాధితురాలిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ కిర్రోన్ ఖేర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నేను అవమానించలేదు !
కాంగ్రెస్ పార్టీతో సహ విపక్షాలు తన మీద విమర్శలు చేస్తున్నారని తెలుసుకున్న కిర్రోన్ ఖేర్ మళ్లీ మీడియాతో మాట్లాడారు. తాను మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఇలా మాట్లాడానని, బాధితురాలిని అవమానించడానికి అలా మాట్లాడలేదని కిర్రోన్ ఖేర్ వివరణ ఇచ్చారు.
ఇది ప్రతిపక్షాల రాజకీయం !
ప్రతిపక్షాలు బాధిత యువతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని కిర్రోన్ ఖేర్ర్ తేల్చి చెప్పారు. అయితే ఓ మహిళగా, ప్రజా ప్రతినిధిగా, బాలీవుడ్ నటిగా, బీజేపీ ఎంపీగా ఉన్న కిర్రోన్ ఖేర్ ఇలా మాట్లాడటం వలన సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతోందంని ఆమె మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు.