నరేంద్ర మోడీ దగ్గరకు డీడీసీఏ పంచాయితీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరారు. ఇప్పుడు ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) పంచాయితీ నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లింది.
డీడీసీఏ నిధులు దుర్వినియోగం చేశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం తెసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో జైట్లీ మీద విరుచుకుపడింది. ఈ సందర్బంలో అరుణ్ జైట్లీ కేజ్రీవాల్ తో సహా ఆప్ నేతల మీద పరువునష్టం దావా వేశారు.
తరువాత సొంత పార్టీకి చెందిన ఎంపీ కీర్తి ఆజాద్ అరుణ్ జైట్లీ మీద విమర్శలు చేశారు. బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఇదే సందర్బంలో బీజేపీ కీర్తి ఆజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపద్యంలో కీర్తి ఆజాద్ నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరడం ప్రధాన్యత సంతరించుకుంది. 1996 నుంచి నరేంద్ర మోడీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన నా అభ్యర్థనకు స్పందిస్తారని కీర్తి ఆజాద్ అంటున్నారు.
తన అభ్యర్థనను నరేంద్ర మోడీ సానుకూలంగా విని న్యాయం చేస్తారని భావిస్తున్నానని కీర్తి ఆజాద్ అహమ్మదాబాద్ లో చెప్పారు. కీర్తి ఆజాద్ సస్పెన్షన్ పై బీజేపీ సీనియర్ నేతలు సైతం అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.