వీళ్లా ప్రజాప్రతినిధులు: సమావేశంలో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు బాహాబాహీ...వైరల్ అయిన వీడియో
ఉత్తర్ ప్రదేశ్:ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే బాహాబాహీకి దిగారు. అందరూ చూస్తుండగానే ఒకరిపైకి ఒకరు పిడిగుద్దులకు దిగారు. ఇదంతా జరిగింది ఒక సమావేశంలో కావడం విశేషం. ఇంతకీ ఎవరా నాయకులు ఏమా కథా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బాహాబాహీకి దిగిన ఎంపీ ఎమ్మెల్యే
ఉత్తర్ప్రదేశ్లో రాజకీయాలు ఎక్కువే. క్రైమ్ రేటు కూడా ఎక్కువే. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు బహిరంగంగానే పిడిగుద్దులు విసురుకోవడం ఓ సభలో కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. యూపీలోని సంత్ కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, బీజేపీకి చెందిన మేద్వాల్ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ భగేల్ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇకపై చెన్నై సెంట్రల్ పేరు మారనుంది... కామరాజ్ను కాంగ్రెస్ అవమానించింది: మోడీ
ఇద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది..?
ఓ ప్రాజెక్టు కోసం వేసిన పునాది రాయిపై తమ పేర్లు లేకపోవడంపై ఇరునేతల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరు నేతలు వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీంతో ఎంపీ త్రిపాఠీ భగేల్పై బూటు విసిరాడు. ఎమ్మెల్యే భగేల్ కూడా ఎంపీ శరద్ త్రిపాఠీపై దాడి చేశాడు. దీంతో భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ఇరునేతలను విడదీశారు. ఇద్దరు నేతలు బాహా బాహికి దిగిన సమయంలో ఉత్తర్ప్రదేశ్ మంత్రి అశుతోష్ టాండన్ అక్కడే ఉన్నారు. ఇక సంత్ కబీర్ నగర్ జిల్లాకు బీజేపీ ఇంఛార్జీగా కూడా మంత్రి అశుతోష్ టాండన్ ఉన్నారు. వీరిద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం ఆయన చేశారు.
ఇద్దరికీ నోటీసులు పంపిన యూపీ బీజేపీ అధ్యక్షుడు
బాహాబాహీకి దిగడంతో ఎమ్మెల్యే అనుచరులు ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇద్దరు నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పాండే చెప్పారు. ఇప్పటికే వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపినట్లు పాండే వెల్లడించారు. ఇద్దరూ గొడవపడుతున్న వీడియో వైరల్గా మారింది. ఇందులో ఒకరిపై ఒకరు దూషణలు దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరి మధ్య గొడవను మీడియా కూడా కవర్ చేసింది. పునాది రాయిపై తన పేరు ఎందుకు లేదని త్రిపాఠి ప్రశ్నించడంతో అసలు గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్రిపాఠీ పేరు ఉండకూడదనేది తన నిర్ణయమే అని భగేల్ చెప్పడంతో గొడవ ప్రారంభమైంది.