హైదరాబాద్ నుంచి నేరుగా మైసూరుకు: కాచిగూడ-బెంగళూరు ఎక్స్ ప్రెస్ పొడిగింపు
మైసూరు: కాచిగూడ-బెంగళూరు మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును మైసూరు వరకు పొడిగించారు. మైసూరు రైల్వేస్టేషన్ లో మంగళవారం ఈ రైలు పట్టాలు ఎక్కింది. మైసూర్ లోక్ సభ సభ్యుడు ప్రతాప సింహ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.
సవరించిన షెడ్యూల్ ఇదీ..
ప్రతిరోజూ సాయంత్రం 7:05 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 12785 ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 6:25 నిమిషాలకు బెంగళూరు క్రాంతివీర సంగోళి రాయణ్ణ బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6:40 నిమిషాలకు బయలుదేరి ఉదయం 9:40 నిమిషాలకు మైసూరుకు చేరుకుంటుంది.
అదే రోజు మధ్యాహ్నం 2:45 నిమిషాలకు మైసూరు నుంచి బయలుదేరే నంబర్ 12786 ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5:40 నిమిషాలకు బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6:20 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.
చాలారోజుల నుంచి కాచిగూడ ఎక్స్ ప్రెస్ ను మైసూరు వరకు పొడిగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని మైసూర్ ఎంపీ ప్రతాప సింహ తెలిపారు. ఎట్టకేలకు తమ డిమాండ్ కార్యరూపం దాల్చిందని చెప్పారు.