వరద నీటిలో పల్టీ కొట్టిన బోటు.. అందులో ఎంపీ: తృటిలో తప్పిన ప్రమాదం
పాట్నా: భారతీయ జనతాపార్టీ లోక్ సభ సభ్యుడు రామ్ కృపాల్ యాదవ్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు వరద నీటిలో పల్టీ కొట్టింది. చూస్తుండగానే ఆయన వరద ప్రవాహంలో పడిపోయారు. దీన్ని గమనించిన వెంటనే స్థానికులు ఆయనను బయటికి లాగారు. భుజాల మీద వేసుకునే టవళ్లతో ఆయనను నీట్లో నుంచి బయటికి లాగారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున పాటలీపుత్ర లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు బిహార్ అతలాకుతలమౌతోన్న విషయం తెలిసిందే. బుధవారం వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో రామ్ కృపాల్ యాదవ్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. దీనికోసం దర్ధా నదిని దాటాల్సి వచ్చింది. వరద నీటితో ఓ మోస్తరుగా ప్రవహిస్తోన్న దర్ధా నదిని దాటడానికి ట్యూబులు, వెదురు కర్రలతో తాత్కాలికంగా అప్పటికప్పుడు ఓ బోటును తయారు చేశారు. దీని మీద ఆయన పాట్నా రూరల్ పరిధిలో ధనరువా గ్రామానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బోటు నియంత్రణ కోల్పోయింది. రామ్ కృపాల్ యాదవ్ తో పాటు దానిపై ప్రయాణిస్తున్న కొందరు నాయకులు బోటుకు ఒకవైపునకు రావడంతో అది అదుపు తప్పింది. అందరూ చూస్తుండగానే.. యాదవ్ వరద జలాల్లో పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయనను బయటికి లాగారు.
#WATCH Bihar: BJP MP Ram Kripal Yadav falls into the water after the makeshift boat he was in, capsized in Masaurhi, Patna district, during his visit to the flood affected areas yesterday. He was later rescued by the locals. (02.10.2019) pic.twitter.com/iwI4OdNGiH
— ANI (@ANI) October 3, 2019
కొద్దిరోజులుగా బిహార్ లో కురుస్తోన్న భారీ వర్షాలకు 50 మందికిపై మరణించారు. రాజధాని పాట్నాను ఆనుకుని ప్రవహిస్తోన్న దర్ధా నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను సందర్శించారు. మరో రెండు రోజుల పాటు బిహార్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. సుమారు రెండు లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.