కేజ్రీవాల్ రూల్ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ, ఫైన్
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం ఏఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరి-బేసి నిబంధనను బీజేపీ ఎంపీ ఉల్లంఘించారు. జనవరి 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి-బేసి విధానం ప్రకారం శుక్రవారం బేసి సంఖ్య గల కార్లను మాత్రమే అనుమతించారు.
ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ సరి నెంబర్ ప్లేట్ గల కారులో వెళుతూ ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు కనిపించారు. దీంతో ట్రాఫిక్ నిబందనను ఉల్లంఘించినందుకు ఆయనకు రూ. 2,000 జరిమానా విధించారు.
రాజకీయాల్లోకి రాకముందు సత్యపాల్ సింగ్ ముంబై పోలీస్ కమిషనర్గా పదవీ విరమణ పొందారు. కాగా, జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ సరి-బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆయా రోజుని బట్టి వాహనాలను రోడ్లపై తిరిగేందుకు అనుమతిస్తారు.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని తొలిరోజు కావడంతో ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంది. సరి-బేసి సంఖ్య గల వాహనాలను ఢిల్లీలో రోజు మార్చి రోజు అనుమతిస్తారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ సరి-బేసి విధానాన్ని బీజేపీ విమర్శించింది.
ప్రత్యామ్నాయ ప్రజా రవాణ ఏర్పాట్లు చేయకుండా ఈ నిబంధన అమలు చేయడాన్ని తప్పుపట్టింది. కాగా సరి-బేసి నిబంధన విజయవంతమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారన్నారు.
రానున్న ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలు దేశానికి మంచి మార్గం చూపుతారన్నారు. మరోవైపు సరి-బేసి విధానంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ మాట్లాడుతూ ప్రజలు తనకు సహకరించాలన్నారు.