బీజేపీకి షాక్: మమతా బెనర్జీ టీఎంసీలో చేరిన ఎంపీ భార్య సుజాత ఖాన్, ఎంత కష్టపడినా..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఎంసీ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరగా.. ఇప్పుడు బీజేపీ నుంచి టీఎంసీలోకి ఓ కాషాయ పార్టీ నేత భార్య చేరడం చర్చనీయాంశంగా మారింది.
టీఎంసీలోకి బీజేపీ ఎంపీ సతీమణి..
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ సతీమణి సుజాత ఖాన్ సోమవారం టీఎంసీ పార్టీలో చేరారు. టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ సమక్షంలో సుజాత్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, భర్త సౌమిత్రా ఖాన్ కూడా పార్టీ మారనున్నారా? అని ప్రశ్నించగా.. అది ఆయన సొంత విషయమని అన్నారు. ఏదో ఒక రోజు ఆయన కూడా నిజాన్ని తెలుసుకుని టీఎంసీలో చేరతారని చెప్పారు.
బీజేపీలో గుర్తింపు లేదు.. వారికే ప్రాధాన్యత
బీజేపీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని, అందుకే తాను ఆ పార్టీని వీడినట్లు సుజాత ఈ సందర్భంగా తెలిపారు. వ్యక్తిగత దాడులు ఎదురైనా పట్టించుకోకుండా.. తన భర్త ఎంపీగా విజయం సాధించేందుకు ఎంతగానో కృషి చేసిన తనను బీజేపీ పట్టించుకోలేదని అన్నారు. నిజాయితీగా ఉండేవారిని పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి, అవినీతి నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సుజాత ఆరోపించారు. అందుకే ఆ పార్టీని వీడి టీఎంసీలో చేరినట్లు తెలిపారు.
Recommended Video
బీజేపీలోకి టీఎంసీ కీలక నేతలు
కాగా, టీఎంసీలో కీలక నేత అయిన సువేందు అధికారితోపాటు సుమారు పది మంది ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్బంగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యూహ కర్త, టీఎంసీ గెలుపు కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీకి ఇక్కడ అంత సీన్ లేదని, బీజేపీకి రెండంకెల సీట్ల కన్నా ఎక్కువ వస్తే తాను ట్విట్టర్ను వీడతానని సవాల్ చేశారు. కాగా, కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.