తలనొప్పి: జిన్నాపై బిజెపి ఎంపీ ప్రశంసలు, ఎందుకంటే?
లక్నో: ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం చల్లారకముందే బీజెపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మరో వివాదానికి తెర తీశారు. జిన్నాను మహాపురుషుడిగా కీర్తించి సంచలనం సృష్టించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తిగా జిన్నాను ఆమె ప్రశంసలు కురిపించారు.
ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించిన విషయంలో ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు బిజెపి నాయకత్వానికి ఇబ్బందులకు గురిచేసింది. ఇటీవల కాలంలో సావిత్రి బాయి పూలే చేస్తున్న వ్యాఖ్యలు బిజెపి నాయకత్వానికి తలనొప్పిగా మారాయి.
భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా ఎనలేని కృషిని చేశారని ఆమె కొనియాడారు. జిన్నా చేసిన త్యాగాలను మరువ కూడదని ఆమె చెప్పారు. దళితుల ఇండ్లలో భోజనాలు చేసే కార్యక్రమాన్ని బిజెపి ఇటీవల చేపట్టింది.ఈ కార్యక్రమంపై కూడ సావిత్రి బాయి పూలే విమర్శలు గుప్పించారు.
రాజకీయ నేతలు దళితుల ఇళ్ళకు వెళ్లడమంటేనే వారిని అవమానపర్చడమేనని ఆమె చెప్పారు. ఏఎంయూలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ వర్సిటీ వైస్ చాన్స్లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. 'జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు.
1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద' అన్నారు. ఈ విషయమై ఇటీవల కాలంలో ఆందోళనలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సావిత్రిబాయి పూలే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.