వీడియో: యడ్డీ ముఖ్యమంత్రి కావాలంటూ..వెయ్యిన్నొక్క మెట్లెక్కిన మహిళా ఎంపీ!
మైసూరు: భారతీయ జనతాపార్టీ లోక్సభ సభ్యురాలు శోభా కరంద్లాజే ఓ సాహసానికి పూనుకున్నారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చాముండి హిల్స్పై వెలసిన శ్రీచాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని కాలినడకన సందర్శించారు. దీనికోసం ఆమె 1001 మెట్లను ఎక్కారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో ఆమె వెంట బీజేపీ కర్ణాటక నేతలు, మైసూరు జిల్లా స్థాయి నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. తమ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో తాను ఈ కార్యక్రమానికి పూనుకున్నానని అన్నారు. శుక్రవారం ఉదయం మైసూరుకు చేరుకున్న శోభా కరంద్లాజే.. కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా చాముండి హిల్స్పైకి చేరుకున్నారు.
#WATCH Mysuru: BJP Karnataka MP, Shobha Karandlaje climbs 1001 steps of Sri Chamundeshwari Devi Temple to pray for BS Yeddyurappa to become the next Chief Minister of the state. pic.twitter.com/coP7X0vRuo
— ANI (@ANI) July 19, 2019
మిస్టర్ చీఫ్ మినిస్టర్..ఎన్నాళ్లీ డ్రామా?
అంతకుముందు- శోభా కరంద్లాజే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రోజుకు ఓ సరికొత్త నాటకానికి తెర తీస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ.. ఆయనకు పదవిపై ఆశ చావలేదని అన్నారు. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ప్రజలు ఛీ కొడుతున్నా పదవులను అంటిపెట్టుకుని ఉన్నారని మండిపడ్డారు. బలపరీక్షను నిర్వహిస్తే- ఎవరి బలం ఎంతో తేలుతుందని అన్నారు. సంఖ్యాబలం లేకపోవడం వల్లే కుమారస్వామి ప్రభుత్వం బల నిరూపించుకోవడానికి ముందుకు రావట్లేదని ధ్వజమెత్తారు. రోజూ ఏదో ఒక సరికొత్త అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి, కాలయాపన చేస్తున్నారని అన్నారు.
శోభా కరంద్లాజే.. ఎవరో కాదు!
శోభా కరంద్లాజే మరెవరో కాదు. యడ్యూరప్పకు అత్యంత ఆప్తురాలు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆమె ఉడుపి-చిక్మగళూరు స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇదివరకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆమె ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో ఆమె హవా బాగా కొనసాగింది. యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2008 నుంచి 2012 మధ్య కాలలో ఆమె గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్యుత్, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. యడ్యూరప్ప ఆమెకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారంటూ అప్పట్లో సొంత పార్టీ నుంచి సైతం నిరసనలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ- వాటిని పట్టించుకోలేదు యడ్యూరప్ప. వీలైన ప్రతీసారీ శోభా కరంద్లాజేకు అటు పార్టీలు, ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చారు.