మరో కశ్మీర్గా కేరళ, సీఏఏకు సపోర్ట్ చేసిన వారికి నో వాటర్, బీజేపీ ఎంపీ కామెంట్లు, కేసు నమోదు
పౌరసత్వ సవరణ చట్టం సెగలు రగులుతూనే ఉంది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతోండగా.. అనుకూలంగా కూడా ర్యాలీలు చేపడుతున్నారు. ఒకడుగు ముందుకేసిన బీజేపీ ఎంపీ తన నోటిదురుసును ప్రదర్శించారు. సీఏఏకు అనుకూలంగా ఉన్నవారికి నీళ్లివ్వడం లేదని ట్వీట్ చేశారు. అయితే దీనిని కొందరు వ్యతిరేకించారు. కేసు కూడా నమోదు చేశారు.
సీఏఏ నిరసనలు: ఏకాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుంది: ప్రణబ్ ముఖర్జీ
నీటి కట కట..
కేరళలోని కుట్టిపురం పంచాయతీతో వివాదం చెలరేగింది. ఇక్కడున్న హిందు కుటుంబాలు సీఏఏకు అనుకూలంగా వ్యవహరించడంతో నీరివ్వడం లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో బీజేపీ ఎంపీ శోభ సోషల్ మీడియాలో స్పందించారు. సీఏఏకు అనుకూలంగా ఉంటే నీరివ్వకపోవడం ఏంటి అని ట్వీట్లో ప్రశ్నించారు. ఇదీ కేరళనా లేదంటే మరో కశ్మీర్ అని ఘాటుగా స్పందించారు.
ఎంపీపై కేసు
ఎంపీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు న్యాయవాది కేఆర్ సుభాష్ చంద్రన్ తప్పుపట్టారు. ఆమెపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ శోభ మొదటి నిందితురాలిగా చేర్చారు. సెక్షన్ 153 (ఏ) ప్రకారం విద్వేషం రెచ్చగొట్టేలా ప్రసంగించారని పేర్కొన్నారు. సెక్షన్ 153 అంటే మతం, జాతి, జన్మస్థలం, నివాసం ఉండే చోట, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంపొందించొద్దని చెబుతోంది. ఎంపీ చేసిన ట్వీట్తో ప్రాంతంలో మత సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రస్తావించారు.
ఏం జరిగిందంటే..
కుట్టిపురం పంచాయతీలో ఏడాదిగా నీటి సమస్య ఉంది. అయితే గ్రామస్తుల అవసరాల మేరకు ఒకరు తన బోర్ నుంచి కాలనీ ప్రజలకు నీరు అందిస్తున్నారు. అయితే వ్యవసాయ పనుల కోసం తీసుకున్న మోటారుతో కాలనీ ప్రజలకు నీరు అందించడంపై కేరళ విద్యుత్ బోర్డు స్పందించింది. పంట కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తే పవర్ సప్లై కట్ చేస్తామని హెచ్చరించింది. దీంతో అతను నీరివ్వడం మానేశాడు. తర్వాత కాలనీలో నీటి కట కట మొదలైందని కుట్టిపురం ఎస్సై అరవింద్ పేర్కొన్నారు.
ట్యాంకర్ల ద్వారా..
హిందూ కుటుంబాలకు నీరివ్వడం లేదని తెలుసుకొన్న ‘సేవాభారతి' అనే సంస్థ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తోంది. రెండురోజుల నుంచి వారి నీటి అవసరాలను తీర్చుతోంది. హిందు కుటుంబాలు నీరు లేక అల్లాడిపోతున్నారని సేవా భారతి సంస్థ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిందని పోలీసులు చెప్తున్నారు.