హర్యానా రసకందాయం: ఇద్దరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి బీజేపీ ఎంపీ.. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా..
హర్యానా అసెంబ్లీలో అధికారానికి బీజేపీ ఐదు సీట్ల దూరంలో మిగిలిపోయింది. 40 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో.. ప్రలోభాల పర్వం మొదలైంది. 31 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ జేజేసీ పార్టీతో చేతులు కలవడంతో బీజేపీ అప్రమత్తమైంది. అధికారం కోసం కావాల్సిన ఐదుగురు అభ్యర్థుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు, ముఖ్య నేతలు ఇండిపెండెంట్లతో బేరసారాలు జరుపుతున్నారు.
రంగంలోకి సునీత
బీజేపీ ఎంపీ సునీత దుగ్గాల్ తమ పార్టీ అధికారం చేపట్టేందుకు శ్రమిస్తున్నారు. తనతో టచ్లోకి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లారు. హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రానియన్ రంజిత్ సింగ్ చౌతాలాను హస్తిన తీసుకెళ్లారు. దీంతో ఆ పార్టీ మరో మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. హర్యానాలో 9 మంది ఇండిపెండెంట్లు గెలిచినందున మరో ముగ్గురు లభించడం పెద్ద కష్టమేమీ కాదు. మిగతా నేతలు ఆ ముగ్గురిని కూడా సమకూరిస్తే తిరిగి ఖట్టర్ ప్రభుత్వం కొలువుదీరతానడంలో ఎలాంటి సందేహం లేదు.
అధికారం లాంఛనమే
ఇదిలా ఉంటే మరోవైపు హర్యానాలో బీజేపీ అధికారం చేపట్టేందుకు రూట్ క్లియర్ అయ్యిందని కొందరు అంటున్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందా ఢిల్లీ వెళ్లగా.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట ఉన్నారని కందా సోదరుడు గోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తాసంస్థకు 2009 నాటి పరిస్థితులే 2019లో రిపిట్ అవుతాయని చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
హంగ్ దిశగా.. కానీ
హర్యానా ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టలేదు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 46 సీట్లు సాధించిన పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. కానీ అధికార బీజేపీ 40 సీట్ల వద్ద నిలిచి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 31 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో వీరి మధ్య అధికారం దోబుచూలాడుతుంది.
కింగ్మేకర్గా జేజేపీ
జేజేపీ నేత దుష్యంత్ను సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది. దీంతో హర్యానా రాజకీయాలు రసకందాయంగా మారాయి. జేజేపీ 10 సీట్లను గెలుచుకుంది. మరోవైపు 9 స్థానాలు గెలిచిన ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. వీరు ఎవరికీ మద్దతు తెలిపితే వారు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు జేజేపీ, మరోవైపు ఇండిపెండెంట్ల హవా కొనసాగుతుంది.