డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్లో బీజేపీ ఎంపీ గగన విహారం: తేజస్లో చక్కర్లు కొట్టిన తేజస్వి
బెంగళూరు: ఉద్యాన నగరి బెంగళూరులో మూడు రోజుల ఏరో ఇండియా షో కొనసాగుతోంది. నగర శివార్లలోని యలహంకలో గల వైమానిక దళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ రెండో రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శుక్రవారం ఈ కార్యక్రమం ముగియబోతోంది. దీనికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయ జనతా పార్టీ నాయకుడు, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య ఎల్సీఏ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లో చక్కర్లు కొట్టారు. కొద్దిసేపు గగనంలో విహరించారు.
Sharing more pictures onboard the Tejas aircraft.#CelebrateLCATejas pic.twitter.com/UBMfbFySSb
— Tejasvi Surya (@Tejasvi_Surya) February 4, 2021
బెంగళూరు దక్షిణం లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆయన ఈ ఉదయం యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. వైమానిక దళాధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఏరో ఇండియా షో వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరిరోజు సాధారణ ప్రజలకు ఈ ఎయిర్ షోను సందర్శించడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన ఎల్సీఏ తేజస్ ఎయిర్క్రాఫ్ట్లో చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లో విహరించడం తనకు ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
ఏరో ఇండియా షో.. దేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందనే విషయాన్ని శతృదేశాలకు చాటి చెప్పిందని వ్యాఖ్యానించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఙానంతో రక్షణ పరికరాలు, యుద్ధ విమానాలను అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. రక్షణ రంగంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇవ్వడం వల్ల అత్యాధునికమైన యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాప్ట్లను రూపొందించుకోవడానికి అవకాశం లభించినట్టయిందని తేజస్వి సూర్య అన్నారు.
Onboard LCA Tejas at #AeroIndia2021#CelebrateLCATejas pic.twitter.com/3z0OQapyRB
— Tejasvi Surya (@Tejasvi_Surya) February 4, 2021