కాంగ్రెస్ నుంచి దేశాన్ని కాపాడాలి: పార్లమెంటు వద్ద బీజేపీ ఎంపీల నిరసన, 12న దీక్ష
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగకుండా అడ్డుకున్న కాంగ్రెస్ తోపాటు ఇతర విపక్షాల వైఖరిని దుయ్యబడుతూ కేంద్రమంత్రులు, ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విపక్షాల ఆందోళనలతో శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి దేశాన్ని రక్షించాలంటూ ప్లకార్డులు చేతబట్టిన కేంద్రమంత్రులు, ఎంపీలు నినాదాలు చేశారు. విపక్షాల తీరుతో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతోందని వారు అన్నారు. మొత్తం సెషన్ వృథా అయ్యిందని, దీన్ని ప్రజలు ఎన్నటికీ అంగీకరించబోరని చెప్పారు.
కాంగ్రెస్ వల్ల పార్లమెంట్ పనితీరుకు ఇబ్బంది కలిగిందని, ఇందుకు నిరసనగా ఏప్రిల్ 12న బీజేపీ ఎంపీలు నిరాహార దీక్ష చేయనున్నట్లు కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు. 'బీజేపీ కలుపుగోలు రాజకీయాల కోసం ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మోసపూరిత రాజకీయాలకు తెరలేపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకుంది. పైగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు, నేతలంతా నిరసన ప్రదర్శనలకు సిద్ధంకండి’ అని ప్రధాని పిలుపునిచ్చినట్లు అనంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కేంద్రమంత్రులు మేనకా గాంధీ, ఉమా భారతి, తదితరులు పాల్గొన్నారు. కాగా, బట్జెట్ సమావేశాలు సజావుగా సాగని 23రోజులకు ఎన్డీఏ ఎంపీలు ఎలాంటి వేతనాన్ని తీసుకోబోరని అనంతకుమార్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, జీతాలు వదులకునేందుకు ఎన్డీఏ మిత్రపక్షాలైన శివసేన ఏకీభవించలేదు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా తాను పార్లమెంటుకు వచ్చానని, తన జీతం తీసుకుంటానని స్పష్టం చేశారు.