ఒడిశాలో పాగాకు షా వ్యూహం: నవీన్కు ప్రత్యామ్నాయం
వరుస విజయాలతో నూతనోత్సాహంతో ఉన్న బీజేపీ.. తదుపరి ఒడిశాలోనూ గెలుపుభావుటా ఎగురవేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించిన కమలనాథులు తమ తదుప
భువనేశ్వర్ / న్యూఢిల్లీ: వరుస విజయాలతో నూతనోత్సాహంతో ఉన్న బీజేపీ.. తదుపరి ఒడిశాలోనూ గెలుపుభావుటా ఎగురవేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించిన కమలనాథులు తమ తదుపరి విజయలక్ష్యంగా అసెంబ్లీని నిర్దేశించుకున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోడీ ప్రభంజనం ప్రభావం చూపినా, ఆయన హవా కనిపించని రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఆ రాష్ట్రంలోని 21 లోక్సభ స్థానాల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.
అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ) 43 శాతం ఓట్లతో 20 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చినా రెండున్నరేళ్లు గడిచే సరికి పరిస్థితిలో మార్పొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఓట్ల శాతం రెట్టింపు చేసుకున్న బీజేపీ 297 సీట్లలో గెలుపొందింది. 2012 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ 36 స్థానాల్లో మాత్రమే గెలుచుకున్నది. అధికార బీజేడీ అత్యధిక సీట్లతో ప్రథమ స్థానంలో నిలిచినా 2012లో ఆ పార్టీ గెలుచుకున్న స్థానాల్లో 150ని కోల్పోవాల్సి వచ్చింది.
నవీన్కు ప్రత్యామ్నాయ నేతగా ధర్మేంద్ర ప్రధాన్
ఇప్పటివరకు రాష్ట్రంలో తమకు తిరుగులేదని భావిస్తూ వస్తున్న బీజేడీ నేతలు స్థానిక సంస్థల ఫలితాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కమలదళంలో నైతికస్థైర్యం ఇనుమడించగా బీజేడీలో కంగారు మొదలైంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా సీఎంగా దీర్ఘకాలంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ (70)కు వయసు పై పడుతుండగా కేంద్ర పెట్రోలియం,సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(48) రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నేతగా ఎదుగుతున్నారు.
కాంగ్రెస్ వల్లే బీజేపీకి లబ్ది
మరోవైపు నవీన్ పట్నాయక్ తన సొంత పార్టీపై పట్టును కోల్పోతున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ విజయం సాధించటం అంత సులభంకాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అప్రమత్తమైన సీఎం నవీన్ పట్నాయక్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని బీజేడీ సీనియర్ నేత భర్తృహరి మహతాబ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడటం వల్లే బీజేపీ లాభ పడిందని విశ్లేషించారు.
ఆదివారం వరకు భువనేశ్వర్లోనే మోడీ
శని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సమావేశం కానున్నది. దీనికి ఒకరోజు ముందే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీ పదాధికారులతో సమావేశం అవుతారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ప్రదేశ్, గుజరాత్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని జాతీయ కార్యవర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోది శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు భువనేశ్వర్లోనే ఉంటారు.
బీజేపీ సమావేశాల వద్ద కేంద్ర అధికారులు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగే వేదికకు సమీపంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒడిశాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, కేంద్ర నిధుల ఉపయోగం ఎలా ఉందో అధికారులతో ప్రధాని సమీక్షిస్తారు. కనుక కేంద్ర మంత్రులు, వారి శాఖల సీనియర్ అధికారులు తొలిసారిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వద్ద కనిపించనున్నారు.
17 ఏళ్లుగా సీఎంగా నవీన్ పట్నాయక్
పదిహేడేళ్లుగా అధికారంలో ఉండటంతో బిజూ జనతాదళ్ పార్టీ శ్రేణుల్లో అలసత్వం పెరిగిపోయింది. ప్రజా సమస్యలను పట్టించుకోవటంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో 22 శాతంగా ఉన్న గిరిజనులు, ఇతర బలహీనవర్గాల్లో పార్టీకి బలమైన పునాదులు వేస్తున్నారు. కులాలకతీతంగా నిరుపేదలైన మహిళలు, నిరుద్యోగులైన యువకులను బీజేపీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.