కర్ణాటకలో బీజేపీ చీఫ్ అమిత్ షా: జ్వరం, కుక్కే సుబ్రమణ్యలో ప్రత్యేక పూజలు, స్కెచ్!
బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటక చేరుకున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మంగళూరులోని బజ్పే అంతర్జాయ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు స్థానిక బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్, ఎమ్మెల్యే అంగార తదితర బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శాసన సభ ఎన్నికలకు ఎలా సిద్దం కావాలి అని అమిత్ షా దక్షిణ కన్నడ జిల్లాల్లో స్కెచ్ వేస్తున్నారు.
సన్మానం మాత్రమే !
మంగళూరు నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కుక్కే సుబ్రమణ్యలోని గెస్ట్ హౌస్ లో బస చెయ్యడానికి అమిత్ షా బయలుదేరారు. మార్గం మధ్యలో కెంజారి ఊరిలో అమిత్ షా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే కెంజారిలో కార్యకర్తలకు అభివాదం చేసిన అమిత్ షా సన్మానం స్వీకరించి ప్రసంగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్యకర్తలు నిరాశ చెందారు.
అమిత్ షాకు జ్వరం
జ్వరం ఎక్కువగా ఉన్నందున అమిత్ షా కెంజారిలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడలేకపోయారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రమణ్య చేరుకున్న అమిత్ షా ఆదిశేష గెస్ట్ హౌస్ లో బసచేశారు.
వైద్యుల సూచన
కుక్కే సుబ్రమణ్యలో అమిత్ షాకు వైద్యులు చికిత్స చేశారు. అమిత్ షా ఆరోగ్యంలో వ్యత్యాసం ఉందని గుర్తించిన వైద్యులు ఎక్కువ సేపు నిలబడి ప్రసంగించరాదని, వీలైనంత వరకూ కుర్చుని ఉండాలని వైద్యులు అమిత్ షాకు సూచించారు.
ప్రత్యేక పూజలు
మంగళవారం ఉదయం కుక్కే సుబ్రమణ్యలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా తరువాత అదే ఊరిలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి పుత్తూరులోని వివేకానంద కాలేజ్ లో విద్యార్థులతో ముకాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు.
అమిత్ షా బిజీ
బీజేపీ చీఫ్ అమిత్ షా మంగళవారం కుక్కే సుబ్రమణ్య, పుత్తూరు, దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ, ఉడిపిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో శాసన సభ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అని సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ఇదే సందర్బంలో ఇటీవల దారుణ హత్యకు గురైన భజరంగ దళ్ కార్యకర్త దీపక్ రావ్ కుటుంబ సభ్యులను భేటీ అయ్యి పరామర్శించనున్నారు.