అమిత్ షా మాస్టర్ ప్లాన్, ఒకే దెబ్బకు సీఎం సీటు, లోక్ సభ ఎన్నికలు, అప్పకు అధికారం !
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో బీజేపీ షాక్ కు గురైయ్యింది.
కర్ణాటకలో అధికారానికి బీజేపీ దూరం అయినప్పటి నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు కర్ణాటకలో చక్రం తిప్పడానికి అమిత్ షా సిద్దం అయ్యారు. ఇదే నెల 25వ తేదీ కర్ణాటకలో అమిత్ షా పర్యటించడానికి సిద్దం అయ్యారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న పరిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఆసక్తిగా మారింది. బెంగళూరు నగరంలోని ప్రైవేట్ హోటల్ లో అమిత్ షా ఉదయం నుంచి రాత్రి వరకు బీజేపీ నాయకులతో చర్చలు జరపనున్నారని సమాచారం.
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారని తెలిసింది. సెప్టెంబర్ నెలలో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో అమిత్ షా బెంగళూరు పర్యటనకు శ్రీకారం చుట్టడం, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లిన మరుసటి రోజు మళ్లీ బెంగళూరు చేరుకోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.