మోడీ ప్రధాని కావడం కొందరికి ఇష్టం లేదు
బెంగళూరు: నరేంద్ర మోడీ ప్రధాని కావడం బీజేపీలోని కొందరు సీనియర్లకు ఇష్టం లేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, శివమొగ్గ పార్లమెంట్ సభ్యుడు బీ.ఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సారధ్యంలో ఇప్పటికే బీజేపీ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న విషయం పార్టీలోని కొందరు పెద్దలు గుర్తు చేసుకోవాలని అన్నారు. మోడీ తిరుగులేని నాయకుడు అని ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ విజయాలు మావే అని నరేంద్ర మోడీ, అమిత్ షా ఏనాడు చెప్పుకోలేదని గుర్తు చేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలలో ఓటమికి నరేంద్ర మోడీ, అమిత్ షాలను నింధించడం సరికాదని యడ్యూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీహార్ ఎన్నికల ఓటమి నుంచి బీజేపీలోని అందరూ పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. పార్టీ వైఖరికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉంటే నాలుగు గొడల మద్య చర్చించుకోవాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ పరువు తియ్యరాదని, అది ప్రతిపక్షాలకు అశ్రంగా మారుతుందని యడ్యూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.