బీజేపీ దెబ్బకు ఆ రోజు మాజీ ప్రధాని దేవేగౌడ, ఈ రోజు శరద్ పవార్: బకరా అయ్యింది మాత్రం?
ముంబై/బెంగళూరు: మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం వెనుక చాల పెద్ద కథే ఉంది. గతంలో బీజేపీ నాయకత్వం కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడకు ఎలా దెబ్బ కొట్టిందో ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు అలాగే దెబ్బ కొట్టింది. అయితే రెండు చోట్ల బీజేపీ దెబ్బకు బకరా అయ్యింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు హెచ్.డీ. కుమారస్వామిని ఆరోజు వలలో వేసుకున్న బీజేపీ ఈ రోజు మహారాష్ట్రలో అజిత్ పవార్ ను వలలో వేసుకుంది. ఈ రోజు శరద్ పవార్ పరిస్థితి ఎలాగుందో ఆ రోజు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ పరిస్థితి అంతే. రెండు చోట్ల చెడింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ నాయకుల వ్యూహాలకు కాంగ్రెస్ నేతలు గిలగిలలాడుతున్నారు.
సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!
20-20 పొలిటికల్ మ్యాచ్
2006లో కర్ణాటక రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. అప్పటి ధరంసింగ్ (కాంగ్రెస్) ప్రభుత్వానికి జేడీఎస్ పార్టీ మద్దతు ఉపసంహరించింది. అప్పట్లో రాత్రికి రాత్రి జరిగిన రాజకీయ పలుపులతో జేడీఎస్-బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అన్ని చర్చలు ఫలించాయి. కర్ణాటకలో ధరసింగ్ ప్రభుత్వం (కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం) కుప్పకూలిపోవడంతో 04-02-2006లో హెచ్.డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా (జేడీఎస్), బీఎస్. యడియూరప్ప (బీజేపీ) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు కర్ణాటకలో 20-20 నెలలు ప్రభుత్వాన్ని పంచుకోవాలని బీజేపీ-జేడీఎస్ నిర్ణయం తీసుకున్నాయి.
చేతులు ఎత్తేసిన మాజీ ప్రధాని
కర్ణాటకలో బీజేపీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో ఆ రోజు దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడపై మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్ తదితరులు బహిరంగంగా మాజీ ప్రధాని దేవేగౌడ మీద విమర్శలు చేశారు. అయితే తన కుమారుడు హెచ్.డీ. కుమారస్వామి తనతో ఒక్కమాట కూడా చర్చించకుండానే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ చేతులు ఎత్తేశారు.
లోపల ఏం జరిగిందో ?
కర్ణాటకలో హెచ్.డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులతో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ రాజీ చర్చలు జరిపారు. మొత్తం మీద ఆ రోజు తండ్రీ కొడుకులు (మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, కుమారస్వామి) మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, కుమారస్వామి సొంతంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. తరువాత మాజీ ప్రధాని దేవేగౌడ దేశంలోని ప్రముఖ నాయకులతో సంప్రధించి ఇందులో తన తప్పు ఏ మాత్రం లేదని వారికి నచ్చ చెప్పడంలో విజయం సాధించారు.
ఆ రోజు బెంగళూరు ఈ రోజు ముంబై
కర్ణాటకలో ఆ రోజు బీజేపీ-జేడీఎస్ పార్టీలు ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయో ఈ రోజు మహారాష్ట్రలో బీజేపీ- ఎన్సీపీలు అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కలయిక పవిత్ర బంధమో లేక అపవిత్ర బంధమో అనే విషయం పక్కన పెడితే రాత్రికి రాత్రి రాజకీయాలు మార్చేయడంలో బీజేపీ మాత్రం 100 శాతం విజయం సాధించిందని చెప్పవచ్చు. ఆ రోజు బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఏం చెప్పారో ఈ రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అదే చెబుతున్నారు. ఇద్దరి మాట మాత్రం మాకు తెలీకుండానే ఇలా జరిగిపోయింది అని ఒకే ఒక్క మాట చెప్పారు.
రెండు చోట్ల బకరా అయ్యింది ఎవరంటే ?
2006లో కర్ణాటకలో, ఈ రోజు (2019 నవంబర్ 23వ తేదీ) మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలతో బకరా అయ్యింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. మాజీ ప్రధాని దేవేగౌడకు తెలీకుండా ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీతో చేతులు కలిపారా ? ఈ రోజు శరద్ పవార్ కు తెలీకుండా అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపారా ?, ఇది సాధ్యం అయ్యే పనేనా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఆ రెండు పార్టీల నాయకులే చెప్పాలి. అయితే కర్ణాటకలో ఆ రోజు, మహారాష్ట్రలో ఈ రోజు బకరా అయ్యింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలవిలలాడిపోతున్నారు.