కర్నాటక అయిపోయింది... బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదేనా.?
ఢిల్లీ : కర్నాటకలో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కథ ముగిసింది. అధికారం చేపట్టిన 13 నెలలకే కుమారస్వామి నేతృత్వంలోని సర్కారు కుప్పకూలింది. అయితే కర్నాటకలో రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ ఉందన్న వాదనలు బలంగా వినిపించాయి. అధికారం కోసం కమలదళం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని ముంబైకి రెబెల్ ఎమ్మెల్యేలను పంపి కుమారస్వామి ప్రభుత్వ పతనానికి కారణమైందని కాంగ్రెస్, జేడీఎస్లు విమర్శించాయి. ఏదేమైనా కర్నాటక మళ్లీ బీజేపీ వశమైంది. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటున్న బీజేపీ మధ్యప్రదేశ్ను తన నెక్స్ట్ టార్గెట్ చేసుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యడ్యూరప్ప అలా.. కుమార ఇలా.. బలపరీక్షతో పరువుతీసుకున్న సీఎం
మధ్యప్రదేశ్పై బీజేపీ దృష్టి
గతేడాది చివరలో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ హస్తగతమైంది. అయితే అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా తయారైంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీజేపీ ఇప్పుడు మధ్యప్రదేశ్పై దృష్టి సారించనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత జీతూ పట్వారీ సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తునవ్నారు. కర్నాటక తమ వశం కావడంతో ఇప్పుడు కమలనాథులు మధ్యప్రదేశ్పై దృష్టి పెడతారని, తమ సర్కారుకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ెపట్టాలో అన్ని రకాలు పెడుతుందని ఆరోపించారు. అయితే ఇక్కడున్నది కుమారస్వామి ప్రభుత్వం కాదు.. కమల్నాథ్ ప్రభుత్వమన్న విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని జీతూ పట్వారీ వార్నింగ్ ఇచ్చారు.
విబేధాలు ముదిరితే చెప్పలేమన్న శివరాజ్
కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం పతనమైతే అందుకు బీజేపీ ఎంతమాత్రం కారణం కాదని, అది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే అవుతుందని అన్నారు. అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఎస్పీ, బీఎస్పీ దయాదాక్షిణ్యాలతో నడుస్తోందని కమల్నాథ్ విమర్శించారు. అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరి ఏదైనా జరిగితే అందుకు తాము బాధ్యులం కాదని అన్నారు. అయితే శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు త్వరలోనే కాంగ్రెస్లో వర్గపోరు మొదలవుతుందనడానికి సంకేతాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నయి.
కాంగ్రెస్కు అత్తెసరు మెజార్టీ
230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 108 సీట్లు కైవసం చేసుకుంది. మేజిక్ ఫిగర్ కన్నా ఒక సీటు తక్కువగా ఉండటంతో నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. దీంతో అధికారం కోల్పోయిన బీజేపీ అప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి మళ్లీ పాలనాపగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ సీనియర్లు చెబుతుండటం విశేషం.