శత్రు, రుణ శేషం ఉండకూడదంటున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి దూకుడు పెంచుతోంది. దక్షిణాదిన జెండా పాతేందుకు పావులు కదుపుతోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రయత్నాలు మరింత ఉదృతం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పెను సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి. పలువురు నాయకుల కదలికలు కూడా కలకలం రేపుతున్నాయి. వారి మాటలు రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పెనుమార్పులకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నే కేంద్రబిందువుగా ఉందని చెప్పొచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో రెండో స్థానానికి అవసరమైతే అధికారంలోకి రావాలన్న వ్యూహంతో ఇప్పటి నుంచే బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.
తెలుగురాష్ట్రాల పైన బీజేపి గురి..! తటస్థనేతలకు గాలం..!!
ఏపీలో టీడీపీ దారుణ ఓటమిని ఆసరాగా చేసుకుని, తెలంగాణలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిని అదనుగా తీసుకుని ఒక్కసారిగా ఎదిగిపోవాలన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కేవలం మూడు పార్లమెంటు స్థానాలు, 23 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయంతో సంచలనం సృష్టించింది. నిజామాబాద్లో ఏకంగా సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఓడించారు. అలాగే కరీనగర్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ను బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓడించారు. అలాగే ఆదిలాబాద్ స్థానంతోపాటు సికింద్రాబాద్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది.
తెలంగాణలో బలపడ్డ బీజేపి..! నలుగురి ఎంపిల గెలుపే ఉదాహరణ..!!
ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ సీనియర్ నేత కిషన్రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఆ పార్టీ వ్యూహకర్త రామ్మాధవ్ తరచూ హైదరాబాద్లో తిష్టవేసి ఏపీ, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా మూడు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బలపడాలంటే ఇదే సరైన సమయని భావించిన బీజేపీ పెద్దలు అందుకు తగ్గట్టుగా మైండ్గేమ్ ఆడుతూ.. చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు వల..! అదికారంలోకి రావడమే బీజేపి లక్ష్యం..!!
కాంగ్రెస్ ఎంపీలు కోమటి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డితోపాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇక్కడ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డితోపాటు మరికొందరు కీలక నేతలు బీజేపీలోకి వెళ్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూరుతోంది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అంతేకాదు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఏపి టీడిపి ఎంపీల దోబూచులాట..! కమలం వైపే కదలికలు..!!
ఇక ఆయన ఇప్పటికే నేరుగా బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లిపోయారు. ఇక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడం టీడీపీకి భవిష్యత్ నాయకత్వ సమస్య స్పష్టంగా కనపడుతుండడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇప్పుడు కమలం వైపు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు రామ్ మాధవ్తో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ముందుముందు మరెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి మరి.