కాంగ్రెస్కు దెబ్బ, మోడీకి ప్లస్: గుజరాత్ టు అసోం, కాశ్మీర్ టు కేరళ దాకా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రహిత భారత్ కావాలని నినదించే భారతీయ జనతా పార్టీకి ఇప్పటి దాకా ఈశాన్య రాష్ట్రాల్లో ఆశించిన బలం లేదు. కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటి దాకా ఖాతా తెరవలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికలతో బీజేపీ దాదాపు దేశమంతటా విస్తరించింది!
గుజరాత్ నుంచి ఈశాన్యంలో కీలకమైన అసోం రాష్ట్రం దాకా, జమ్ము కాశ్మీర్ నుంచి కేరళ దాకా విస్తరించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ఉన్న బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీగా కాంగ్రెస్తో సమానంగా నిలిపాయి.
ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అధికారాన్ని దక్కించుకోవడం బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం అని చెప్పవచ్చు. కేరళలో మొదటిసారి పాగా వేయడం గమనార్హం. ఈ అసెంబ్లీ ఎన్నికలతో అటు కాశ్మీరు నుంచి కేరళకు, ఇటు గుజరాత్ నుంచి అసోం వరకూ విస్తరించిన పార్టీగా బీజేపీ నిలిచింది.
అసోంలో ఇంతటి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత విజయం సాధించింది. అసోంలో బీజేపీ ఏకంగా 30.3 శాతం ఓట్ షేర్ (2011లో 11.47 శాతం) సాధించగా, 2011లో ఉన్న అయిదు అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 56కు పెరిగాయి.
కేరళలో గెలుచుకుంది ఒక సీటే అయినా 10.8 శాతం ఓట్లను (2011లో ఆరు శాతం) ఓటు షేర్ను పొందింది. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ 10.2 శాతం ఓట్లను (2011 ఎన్నికల్లో అయిదు శాతం) బీజేపీ సాధించింది. ఈ ఎన్నికలు రెండేళ్ల ప్రధాని మోడీ పాలనకు ఊరటనిచ్చేవే. బీజేపీలో మనోధైర్యాన్ని నింపేవే. మరోవైపు, కాంగ్రెస్ అసోం, కేరళలో ఓడిపోయింది. ఇది ఆ పార్టీకి షాకే.