రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు, అడ్వాన్స్ రూ. 5 కోట్లు, బీజేపీ బంఫర్ ఆఫర్, జేడీఎస్ ఎమ్మెల్యే బాంబు!
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆపరేషన్ కమల చేపట్టిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామని బంఫర్ ఆఫర్ ఇచ్చారని, రూ. 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని కోలారు జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ ఆరోపించారు.
కోలారు జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు సీఎన్. అశ్వథ్ నారాయణ, ఎస్ఆర్. విశ్వనాథ్, సీపీ యోగేశ్వర్ తన ఇంటికి వచ్చారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామని బీజేపీ నాయకులు అన్నారని జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ ఆరోపించారు.
రూ. 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే రూ. 25 కోట్లు ఇస్తామని చెప్పారని జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ ఆరోపించారు. అయితే తన పదవికి తాను రాజీనామా చెయ్యడం సాధ్యం కాదని, పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ చెప్పారు.
ముఖ్యమంత్రి కుమారస్వామితో తాను మాట్లాడి బీజేపీ నాయకులు ఇచ్చిన రూ. ఐదు కోట్లు అడ్వాన్స్ వాపస్ ఇస్తానని జేడీఎస్ ఎమ్మెల్యే కే. శ్రీనివాస్ గౌడ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి రూ. 200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దం అయ్యారని ఆరోపించారు.
కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ నాయకులకు నిద్రపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.