మాజీ సీఎం దెబ్బకు దిగివచ్చిన బీజేపీ నాయకులు, విదేశాలు, కుమార్తెలకు టిక్కెట్లు, ఆఫర్!
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు బీజేపీ నాయకులు స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లరని, ఆ నమ్మకం తమకు ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.
కేంద్ర మంత్రి పదవి
కర్ణాటక ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేసిన ఎస్ఎం. కృష్ణను కాంగ్రెస్ పార్టీ నాయకులు చివరిలో ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఎస్ఎం. కృష్ణను పూర్తిగా నిర్లక్షం చెయ్యడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
మోడీతో ఒక్కసారి
గత ఏడాది మార్చి నెలలో బీజేపీలో చేరిన ఎస్ఎం. కృష్ణ పెద్దగా ఆ పార్టీ నాయకులతో బయట ఎక్కడా కనపడలేదు. జనవరిలో మండ్యలో జరిగిన బీజేపీ పరివర్తనా యాత్రలో, గత నెల బెంగళూరులో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాత్రం బీజేపీ నాయకులతో కలిసి ఎస్ఎం. కృష్ణ ప్రజలకు కనిపించారు.
ఎస్ఎం. కృష్ణ మౌనం
కాంగ్రెస్ పార్టీలో పట్టించుకోలేదని బీజేపీలోకి వస్తే ఇక్కడా తనను పట్టించుకోలేదని ఎస్ఎం. కృష్ణ మౌనంగా ఉన్నారు. కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపించినా ఎస్ఎం. కృష్ణ తెరమీదకు రాకపోవడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మాజీ ఉప ముఖ్యమంత్రి
ఎస్ఎం. కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయంపై కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ బుధవారం స్పందించారు. ఎస్ఎం. కృష్ణ కాంగ్రెస్ లో చేరే ప్రసక్తేలేదని, ఆయన సేవలు బీజేపీకి అవసరం అని ఆర్. అశోక్ చెప్పారు.
విదేశాలు, కుమార్తెలకు టిక్కెట్లు
ఎస్ఎం. కృష్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, ఈనెల 13వ తేదీన ఆయన భారత్ వచ్చిన తరువాత శాసన సభ ఎన్నికల విషయంలో ఆయనతో చర్చిస్తామని ఆర్. అశోక్ అన్నారు. ఎస్ఎం. కృష్ణకు శాంభవి, మాళవిక అనే ఇద్దరు కూర్తెలు ఉన్నారు. ఎస్ఎం. కృష్ణ కుటుంబ సభ్యులు మండ్య జిల్లా, బెంగళూరులోని ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తామన్నా కచ్చితంగా టిక్కెట్లు ఇస్తామని ఆర్. అశోక్ స్పష్టం చేశారు.