కర్రలు, రాళ్లతో బీజేపీ ఆఫీస్పై దాడి: మోడీపై ఊగిపోయిన మమత
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య రాజకీయ వైరం ఉద్రిక్తంగా మారింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య రాజకీయ వైరం ఉద్రిక్తంగా మారింది. వారం రోజుల వ్యవధిలో టీఎంకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో టీఎంసీ శ్రేణులు మంగళవారం భగ్గమన్నాయి.
తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా ఆ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షాలపై మమత విమర్శలు గుప్పించారు. సీబీఐ చేత టీఎంసీ బందీ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు కోల్కతాలోని బీజేపీ కార్యాలయంపై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది.
మోడీపై మమత ఆగ్రహం
సుదీప్ బంధోపాధ్యాయను అరెస్టు చేసిన అనంతరం మమత బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ రాజకీయాలను మోడీ అర్థం చేసుకోవడం లేదన్నారు.
దేశంలో అత్యవసర పరిస్థితి అమలవుతోందని, చాలా రాజకీయ పార్టీలు భయంతో వణికిపోతున్నాయని, దీనిపై మాట్లాడేందుకు ముందుకు రావడం లేదన్నారు. ప్రజలు రోడ్ల పైకి రావాలని, పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, మోడీకి గుణపాఠం చెప్పాలన్నారు.
సుదీప్ అరెస్టు చేస్తే..
తమ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయను అరెస్టు చేస్తే, మేం నిరసన తెలియజేయబోమని వారు అనుకుంటున్నారని, అది తప్పు అన్నారు. మోడీకి తాను సవాలు విసురుతున్నానని, ఆయన తమనేమీ చేయలేరన్నారు.
ప్రజల గొంతును నొక్కేయలేరు
ప్రజల గొంతులను నొక్కేయలేరని స్పష్టం చేశారు. సుదీప్ బంధోపాధ్యాయ అరెస్టు విషయమై మాట్లాడుతూ తాము న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కోర్టు నుంచి న్యాయం కోరుతామన్నారు.
ఇద్దరు ఎంపీల అరెస్ట్
కాగా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు టీఎంసీ ఎంపీలను అరెస్టు చేసింది. ఎంపీ తపస్ పాల్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. అతను డిసెంబర్ 30న అరెస్టయ్యారు. సుదీప్ బంధోపాధ్యాయను మంగళవారం అరెస్టు చేశారు. తపస్ పాల్ కుమార్తె సోహినిని మంగళవారం భువనేశ్వర్లో సీబీఐ రెండోసారి ప్రశ్నించింది.