గేరు మార్చిన బీజేపి ఆపరేషన్ ఆకర్ష్ బస్సు..! కర్ణాటక వయా తెలంగాణ,ఏపి టు కోల్కత...!!
ఢిల్లీ/హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆపరేషన్ ఆకర్శ్ తో సరికొత్త అవతారం ఎత్తుతోంది. బీజేపి యేతక రాష్ట్రల మీద ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పట్టు బిగించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా, ఇతర పార్టీల నుంచి తనలోకి వలసలను ప్రోత్సహిస్తోంది. జంపింగ్ జపాంగులకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం వైరి పార్టీల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మైండ్ గేమ్ కు తెర లేపుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలను, అధికార-విపక్ష ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. తాజాగా కర్ణాటక మీద తన ముద్రవేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ఏపి తెలంగాణ మీదుగా పశ్చిమ బెంగాల్ మీద ప్రభావం చూపేందుకు పావులు కదుపుతోంది.
బీజేపిలోకి 107 మంది ఎమ్మెల్యేలు...! మమతా బెనర్జీని ఉడికిస్తున్న అమీత్ షా..!!
ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్టానం పశ్చిమబెంగాల్ పై ప్రధానంగా దృష్టి సారించింది. 2021లో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 18 స్థానాలు దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ, ఈ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలకు ఎగబాకడాన్ని మమత జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీలోనూ పాగా వేయాలని చాప కింద నీరులాలాగా ప్రయత్నాలు సాగిస్తోంది.
బెంగాల్ ను టార్గెట్ చేసిన బీజేపి..! సీరియస్ అవుతున్న దీదీ..!!
ఈ నేపథ్యంలోనే, తాజాగా బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) - సీపీఎం - కాంగ్రెస్ పార్టీలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని ఆయన చెప్పడం.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ ఎమ్మెల్యేలంతా తమతో సంప్రదింపులు సాగిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కామెంట్లపై ఆయా పార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే ముకుల్ రాయ్ వ్యాఖ్యలను మమత సీరియస్ గా తీసుకున్నారు.
ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో మమత..! బీజేపి వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో సీఎం..!!
టీఎంసీ ఎమ్మెల్యేలంతా ప్రజలకు చేరువ కావాలని, అవసరమైతే.. గతంలో చేసిన తప్పులు ఒప్పుకుని క్షమాపణలు అడగాలని ఇటీవల మమత చెప్పారు. ఏదేమైనా ఒక రాష్ట్రం నుంచి ఏకంగా 107 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడమంటే సాధారణ విషయం కాదు. అదే జరిగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 294. 2016 ఎన్నికల్లో టీఎంసీకి అత్యధికంగా 211 సీట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం మూడు సీట్లే దక్కాయి. కాంగ్రెస్ 44 సీట్లు సొంతం చేసుకుంది. వామపక్షాలు 32 స్థానాల్లో గెలుపొందాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఎలాగైనా సరే, బెంగాల్లో పాగా వేయాలన్న ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కాస్తా... భారతీయ జంపింగ్ పార్టీ(బీజేపీ)గా సరికొత్త అవతారం ఎత్తుతోంది.
బెంగాల్ తో మొదటి నుంచీ కయ్యమే..! ఈ సారీ దీదీ నిలువరించగలుగుతుందా..?
ఇటివల కాలంలో రాజకీయంగా బహుబలులుగా మారిన మోడి, అమిత్ షా లాంటి బలమైన నాయకత్వాన్ని కూడగట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికలలో సామాన్యుడికి మరింత దగ్గరైన బీజేపి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మరింత ప్రభావాన్ని పొందే అవకావాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ వంటి చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఉండదనే చర్చ జరుగుతోంది. కర్నాటక సంక్షోభం సమసిపోయి బీజేపికి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు మారినా, మారక పోయినా బీజేపికి ఒరిగేది పెద్దగా ఏమీ ఉండదనే చర్చ కూడా జరుగుతోంది. ప్రభావం కోసం మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే మమత బెనర్జీ ఎంత వరకు బీజేపి కి అవకాశం ఇస్తుందో చూడాలి...!